...

...

29, ఆగస్టు 2009, శనివారం

బెస్తవారి జీవితాలను ప్రతిబింబించే కథ!

సుప్రసిద్ధ కథా రచయిత జాతశ్రీ గారి రచన అగ్నితుఫాను మీకోసం ప్రత్యేకంగా కథాజగత్ బ్లాగులో ప్రకటిస్తున్నాము. సముద్రంలో చేపలను వేటాడే బెస్త వారి జీవితాలను ప్రతిబింబించే ఈ కథ చదివి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

12, ఆగస్టు 2009, బుధవారం

కథాజగత్తు మరో కథ!

నా బ్లాగు కథాజగత్‌లో శ్రీ రంగనాథ రామచంద్రరావుగారి కథ దింపుడు కళ్ళం ప్రకటించ బడింది. ఈ కథ విపుల పత్రికలో ఏప్రిల్ 2000లో ప్రకటించబడింది. ఈ కథ శ్రీ రంగనాథ రామచంద్రరావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తప్పక చదవాల్సిన కథ ఇది. చదివి మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషిస్తాను.

8, ఆగస్టు 2009, శనివారం

శ్రీ వరిగొండ కాంతారావు గారికి

సాహితీ మిత్రులు శ్రీ కాంతారావుకు
సహృదయపు వందనమ్ములు!
ఆదరముగ మీరిచ్చిన
అయిదు పుస్తకములు
ఆసాంతం చదివినాను.

కాజిపేటలోన
ఏ.పి.ఎక్సుప్రెస్సు
ఎక్కినది లగాయితు
లష్కరు చేరుదాక
లీనమై మీ పొత్తములు
కడదాక చదివినాను.

దోస్తాన కథల సంపుటి
కడు పసందుగా వున్నది.
'వర్షం'కథ వ్యంగ్యధారను
కురిపించు చున్నది.
వర్తమానపు కడగండ్లను
పురాణపాత్రల కన్వయించిన
తీరు తమాషగనున్నది.
జన్మభూమి పథకమును
'కన్న నేల'యని ఎక్కెసమాడి
దానిలోని లొసుగులను
ఎండగట్టిన వైనం
బహు బాగున్నది.
మనిషికి మనిషి తోడు
అనియెడి సంఘనీతిని
'ఆలంబన' కథలోన
అతిచక్కగ చెప్పినారు.
'దోస్తాన'కథ చదివినంక
కండ్లల్ల నీరు తిరిగె
అవ్వతోడు ఇది నిజం!
స్వంత ఇంటికై
చింత పడే మధ్య తరగతి
సగటు జీవి
అగచాట్లను 'ఇల్లు' కథలో
వివరించినారు.
ఆంధ్రభూమి వారపత్రికలో
వచ్చిన ఒక శీర్షిక ప్రేరణతో
'ఊరూ- పేరూ'చక్కగా అల్లినారు.
చరిత పేరుతో కట్టు కథలను
చెప్పజూసెడి వారికిది
చెంప పెట్టు.
ప్రతిభకు పాతర బెట్టి
ఉత్తర దక్షిణాల
ప్రాభవాన్ని
'అధముడు' చాటితే
'డింగుడిబో'
సున్నిత హాస్యాన్ని
పంచింది సుమా!
గాంధి పేరు పెట్టుకుని
గూండాగిరి చేస్తున్న
రాజకీయ బేహారి
చంపబడి'మృతవీరుడై'నాడు.
చీపులిక్కరును
'అగ్గువ సీస'యని
అతి చమత్కారముగ
తెనిగించినారు
'నువ్వె నా సర్కారు'లోన.
కనికారం లేని 'అన్నల'
'బస్సు దహనపాకలి'కి
పసిద్దయిన పల్లేపోరి
'బతుగ్గాలిపాయె'.
నిజంగా మీ దోస్తాన
కథాజగత్తుకు ఒక నజరాన!

మీ'సంద్రం'లో నేను
ఓలలూగినాను.
'గగనం'లో
కూడ విహరించినాను.
తెలుగు భాషపై
మీకున్న మమకారమును
'ప్రాచ్యాప్రాచ్యములు',
'విషాంగ్ల బాలురు',
'పిచ్చి కవి', 'తెంగ్లీషు'
కైతలు చాటుచున్నవి.
'అమ్మాయికి జాగ్రత్త'ను
అరటిపండు వొలిచినట్లు
అతిరమ్యముగ జెప్పినారు.
పసిమనసుపై
యమసెట్టు పెట్టు
వత్తిడిని 'చివరి లేఖ' చాటింది.
'పచ్చదనం'పై మీ 'ఫికరు'
'చెట్టు' కవితలో కనబడింది.
టెలివిజనును
'శవ పేటిక'తో పోల్చినారు
ఇది మీకే చెల్లును.
'యూజరు చార్జీల'పై
మీ సెటైరు
నా మనసును దోచింది.
'ఇంటర్వ్యూ','స్వర్గంల'
కవితలు మరీ మరీ నచ్చాయి.
మంద బుద్ధిని నేను
'ఏం చేద్దామ'నే కవితను
మామూలుదనే భ్రమసినాను
సైకిలు సంగతి వచ్చు వరకు.
కాడి ఎద్దులు, కంకి, కొడవలి,
సుత్తె, ఉదయార్కము,
ఆవుదూడ, రిక్త హస్తము,
రెండు ఆకులు, కమలాల
మతలబు ఎంచి చూడగ
కైతలోని 'సారాసెంబు'
తెలిసి వచ్చెను.

'ఏలికకొక లేఖ'ను
ఏకబిగిన చదివినాను.
ప్రజల వెతలను
ప్రభుత దృష్టికి
తీసుకెళ్ళే ప్రయత్నమ్మిది
భళీ!భళీ!బాగు!బాగు!
సంఘమందున
ప్రతి దినమూ అగుపించే
వెతలకు వేదనా భరితులై
మనసు కవ్వము మథియించగ
వ్యంగ్య రూపమున కవితలల్లినారు.
మా మనసు దోచినారు.

పొగడ్తలెక్కువైనాయని
కిన్కబూనకు మిత్రమా!
ఉన్నమాట అంటే
పొగడినదెటులో చెప్పుమా!
నిజమెప్పుడు
నిష్టూరమని అన్నదెవడు?
కర్ణపేయముగ నుండును
కదా అపుడపుడు!

శ్రీ రాడ్రాణ్నరేంద్ర భూపతి(దుష్ట సంధియా?) పేరున
హనుమకొండన వెలసినట్టి
ఆంధ్ర భాషానిలయపు ఘనచరితను
చదివి పులకరించినాను.
మీ కార్య దర్శనమున
ఈ నిలయానికి
పూర్వ వైభవమ్ము
ఒనగూడునని
నిశ్చయమ్ముగ నమ్మినాను.

మీదు కవితలు
చదివి నాకు కూడ
కొంత పైత్యమెక్కినది.
మీ తరీఖన గాకున్న
దేడ్‌దిమాఖ్ గాడ్ని
ఏదో నాలుగు ముక్కలు
గెలక బెడితి.
ఇంకోతీర్గ అనుకోకుండ్రి.
తప్పులున్న మన్నించుండ్రి!

భవదీయుడు

కోడీహళ్లి మురళీమోహన్

1, ఆగస్టు 2009, శనివారం

ప్రియమైన శత్రువు

కోలపల్లి ఈశ్వర్‌గారి కథానిక ప్రియమైన శత్రువు కథాజగత్‌లో ప్రకటింపబడింది. చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.