...

...

30, డిసెంబర్ 2012, ఆదివారం

తీగలాగితే...


తీగలాగితే...
                                                - స్వరలాసిక

"ఎడిటర్ గారికి - ఈ వారం మీ పత్రికలో ప్రచురించిన సూరిబాబు గారి గులాబిముళ్ళు కథ ఇంటర్‌నెట్ నుండి కాపీ కొట్టబడింది. పాత్రల పేర్లు మార్చి క్లైమాక్స్ కొంచెం మార్చినంత మాత్రాన పాఠకులు కనుక్కోలేరని సూరిబాబు భావించినట్టున్నారు. ఇరవై ఏళ్ల క్రితం అయితే సూరిబాబు లాంటి రచయితల ఆటలు సాగేవి. ఇప్పుడలా కాదు. సమాచార విప్లవం ఇలాంటి రచయితల అసలు స్వరూపాన్ని బయట పెట్టేస్తోంది. ఈ కథకు మూలమైన ఇంగ్లీషు కథ ప్రచురింపబడిన వెబ్‌సైట్ యు.ఆర్.ఎల్. లింకును క్రింద ఇస్తున్నాను. చదివి నా ఆరోపణ నిజం అవునో కాదో మీరే నిర్ధారించుకోండి. మూల రచయిత పర్మిషన్ తీసుకుని కథను అనువదించి ఉంటే ఆ విషయం పాఠకులకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా సదరు రచయితకు ఉంటుంది. మన పత్రికలు ఇలాంటి కాపీ కథలను అరికట్టడానికి కొన్ని ఎథిక్స్ పాటించాలి. కాపీరాయుళ్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి వారి రచనలను బహిష్కరించాలి. అప్పుడే పాఠకులను గౌరవించినట్లు అవుతుంది. గమనించగలరు - పరమానందం" అదీ ఇ-మెయిల్ సారాంశం.

 ఆ మెయిల్ చదువి నవ్వుకున్నాను. సూరిబాబు గత మూడు దశాబ్దాలుగా తెలుగు పత్రికారంగాన్ని దున్నేస్తున్న గొప్ప రచయిత. అతని కథలు,సీరియళ్లు,ఫీచర్లు దాదాపు అన్ని తెలుగుపత్రికల్లోనూ వస్తోంది. అలాంటి రచయితను వదులుకోవడానికి మేమే కాదు ఏ పత్రికా సిద్ధంగా లేదు.

ఈ పత్రికలో సబ్ఎడిటర్‌గా చేరకముందు నుండీ తను  సూరిబాబు అభిమాని. పాఠకుల అభిరుచుల్ని ఎప్పటికప్పుడు పసిగట్టి వాటికి అనుగుణంగా రచనలు చేయడం సూరిబాబుకు మాత్రమే తెలిసిన విద్య. కాబట్టే ఇంతకాలంగా ఆంధ్రుల అభిమాన రచయితగా వెలుగొందుతున్నాడు. అలాంటి సూరిబాబుపై ఇతనెవడో చేసిన ఆరోపణను సీరియస్‌గా తీసుకోలేము.

అయినా ఇప్పుడు నైతికవిలువలకు అర్థం పూర్తిగా మారిపోయింది. ఇదివరకటిలా మడి కట్టుకుని కూర్చోవటం ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కుదరని పని. మీడియా విస్తరించిన కొద్దీ రచనలకూ, రచయితలకూ డిమాండ్ పెరిగింది. అందులోనూ సూరిబాబులాంటి రచయితలకు మరీ డిమాండ్ పెరిగిపోయింది. అయినా ఏ రచయితైనా ఎన్నని కొత్త కొత్త కథలను సృష్టించగలడు? ఇప్పుడు తెలుగులో సృజన సేచురేషన్ పాయింటును దాటిపోయింది. కాబట్టి కొత్త అయిడియాలకు రచయితలు ఇతర భాషా రచనల వైపు చూస్తున్నారు. పత్రికల వాళ్లు కూడా ఈ పరిణామాల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాదు రచయితలకు కొన్ని హింట్లను పత్రికలే యిస్తున్నాయి. తను కూడా సూరిబాబుకు "ఈ ప్లాట్ చూడు గురూ మనకు పనికి వస్తుందేమో" అని కొన్ని పాత విదేశీ కథలను అందించిన సందర్భాలు అనేకం. 

ఐతే సూరిబాబు ఏ కథను కాపీ(నిజానికి మేం ఎడిటర్లం కాపీ అనే పదాన్ని వాడకూడదు. ఇన్స్పిరేషన్‌ లేదా ఇన్‌ఫ్లూయన్స్ అనాలి) చేసినా ఎవరూ సులభంగా కనుక్కోలేంత పకడ్బందీగా ఆ కథను మార్చివేసి స్వంత కథ అనిపించేటట్టు చేస్తాడు. అలాంటిది ఈ పరమానందమెవడో గట్టి పిండమే సూరిబాబు ఫలానా కథ ఫలానా చోటనుండి కాపీకొట్టాడని చెప్పగలుగుతున్నాడు.        

ఈ గులాబిముళ్లు కథకు మూల కథ ఎలా వుంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ మెయిల్‌లో ఇచ్చిన లింక్‌ను నొక్కాను. ఫిక్షన్ మాఫియా డాట్ నెట్ అనే వెబ్‌సైటులో అలెక్స్ అనే రచయిత రాసిన డార్క్ ఎకో అనే కథ ఓపెన్ అయ్యింది.

జాగ్రత్తగా పరిశిలిస్తే తప్ప ఈ కథకూ గులాబిముళ్లు కథకూ ఒకటే ప్లాట్ అని అర్థం కాదు. అయితే నన్ను అంతకన్నా ఆశ్చర్య పరచిన విషయం మరొకటుంది. ఇదే కథను నేను రెండ్రోజుల క్రితం చదివాను. వృత్తి(?)లో భాగంగా పాతికేళ్లనాటి పాత ఇలస్ట్రేటెడ్ వీక్లీ తిరగేస్తుంటే కనిపించి చదివింప జేసిన కథ అచ్చం ఇలాగే ఉంది!

వెంటనే లైబ్రరీకి పరుగులాంటి నడకతో చేరాను. కార్పొరేట్ మీడియా సంస్థ నుండి వెలువడుతున్న మా పత్రికకు అతిపెద్ద లైబ్రరీనే ఉంది. రెండ్రోజుల క్రితం చదివిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ బౌండ్‌ను రేక్ నుండి తీసి ఆ కథకోసం వెదకసాగాను. 

ఎక్కువ శ్రమపడకుండానే ఆ కథ కనిపించింది. శ్రద్ధగా మరోసారి చదివాను. కథ పేరు ది పర్పుల్ కలర్ హ్యాండ్ బాగ్. రచయిత్రి అనితా నంబూద్రి. సందేహం లేదు ఈ కథను చదివే డార్క్ ఎకో కథ రాసి ఉంటాడు ఆ రచయిత. సునామీ, రిసెషన్ లాంటి కొత్తపదాలు కొన్ని చొప్పించి పాత కథను కొత్తగా మలిచాడు అలెక్స్.

ఆ బైండు పుస్తకాన్ని మూసేస్తుండగా ఒక పేజీలో లెటర్స్ టు ఎడిటర్ శీర్షికలో పర్పుల్ హ్యాండ్ బ్యాగ్ అనే పదాలు కనిపించాయి. ఆ ఉత్తరం చదివాను. ఆ కథ పడిన నాలుగు వారాల తర్వాతి సంచిక అది. ఎవరో అనితా నంబూద్రి కథ ఒక చైనీస్ కథకు మక్కీకి మక్కీ కాపీ అని రాశారు. ఆ కథ పేరూ, కథా రచయిత పేరూ, ఆ కథ ప్రచురించిన చైనా పత్రిక తేదీ వివరాలు అన్నీ ఆ ఉత్తరంలో ఉన్నాయి.

నాకు ఉత్సుకత మరింతగా పెరగ సాగింది. దీని సంగతి ఏమిటో పూర్తిగా తేల్చాలని మనసులో ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను. ఫేస్‌బుక్‌లో మిత్రుడైన జెంగ్ లాంగ్ కు ఈ వివరాలన్నీ ఇస్తూ అసలు సంగతి కనుక్కోమని ఒక ఇ-మెయిల్ పెట్టాను. వారం రోజుల లోపే అతని నుండి రిప్లై వచ్చింది. 

నేను పేర్కొన్న చైనీస్ రచయిత తనకు స్నేహితుడేననీ, అతడిని నేను పంపిన వివరాలు అడిగితే ఆ కథ వ్రాసింది ఆ రచయితేనని తెలిసిందనీ, ప్రచురించిన పత్రిక వివరాలు అన్నీ సరిపోయాయని లాంగ్ బదులు ఇచ్చాడు. తనకు ఆ కథ రాయడానికి ప్రేరణ ఇండియాలోని రాకేష్ వర్మ అనే రచయిత రాసిన అంధేరే ఖులా దర్వాజా అనే హిందీ కథ అనీ ఆ కథను అప్పట్లో వస్తున్న నయీ దునియా అనే పత్రికలో చదివాననీ సదరు రచయిత లాంగ్‌కు వివరించినట్టు ఆ మెయిల్ లోని సారాంశం.  

నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆ అంధేరే ఖులా దర్వాజా కథ విషయమై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. ఆ కథ ఒక  కన్నడ  కథనుండి కాపీ అయినట్టు ఆ విషయం కోర్టుదాకా వెళ్ళినట్టు నాకు బాగా జ్ఞాపకం. ఇక నా అన్వేషణ 'నయీ దునియా'పై పడింది. చాలా కష్టపడితేగానీ ఆ కథ పడిన పత్రిక సంచిక తరువాతి సంచికలూ దొరకలేదు. మొత్తానికి ఎలాగైతేనేం సాధించాను. అంధేరే... కథ పూర్తిగా చదివాను. మధ్యలో చైనీస్ కథ చదవలేదు కానీ పర్పుల్... కథకూ ఈ కథకూ ఎక్కువ పోలికలే కనిపించాయి.

ఇక నయీ దునియా పాత సంచికలనుండి ఆ కన్నడ కథ కూపీలాగాను. కథ పేరు మొదివే హుడిగి. రాసింది రామణ్ణ శ్యానభోగ. సంపిగె అనే పత్రికలో వచ్చింది. నా అదృష్టం కొద్దీ నాకు కన్నడం చదవడం మాట్లాడటం వచ్చు. ఒక రెండు వారాలు కష్టపడిన తరువాత ఆ సంపిగె పత్రిక సంపాదించగలిగాను. ఆత్రంగా మొదివే హుడిగి (పెళ్ళి కూతురు) కోసం చూశాను. దొరికింది. ఆ కథ పూర్తిగా చదివాక ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది.              

మరుసటి రోజు సూరిబాబు నా సీటు వద్దకు వచ్చాడు తన వీక్లీ ఫీచర్ అందివ్వడానికి. "కూర్చో గురూ! నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను" అంటూ పరమానందం మెయిల్ నుండి మొదివే హుడిగి దాకా అంతా పూసగుచ్చినట్టు వివరించాను. నా మాటలు వింటున్నప్పుడు అతని మొహంలో రంగులు మారసాగాయి. చివరగా మొదివే హుడిగి కథను టూకీగా తెలుగులో చెప్పినప్పుడు అతని మొహంలో ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు కనిపించింది. 

"ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఈ రామణ్ణ అనే అతను నా కథను కన్నడంలోకి అనువదించడానికి నా పర్మిషన్ అడిగాడు. నేను నా అనుమతిని తెలుపుతూ ఉత్తరం రాశాను కూడా. అయితే తర్వాత అతని నుండి ఏ కమ్యూనికేషన్ లేదు. ఆ సంగతి నేనూ మరిచి పోయాను"

"వారినీ! గులాబి ముళ్ళు కథకి మూలం 'దులపర బుల్లోడ' కథా? నా కథను నేనే కాపీ కొట్టానన్నమాట" సూరిబాబు వదనంపై నవ్వులు మొగ్గలు వేశాయి.

నేనూ చిద్విలాసంగా నవ్వాను. ఆ బుల్లోడి కథకు మూలకథను అన్వేషించాలనే ఆలోచన నా మనసులో క్రమేపీ రూపు కట్టుకోసాగింది.   

(ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం 30-12-2012 సంచికలో ప్రచురితం)


మళ్ళీ ఓ కథ!

నా కథ ఒకటి నవ్య వీక్లీలో 2008 ఫిబ్రవరి 27 సంచికలో ప్రచురింపబడింది. బహుమానం దాని పేరు. ఆ కథకు మంచి స్పందనే లభించింది. భద్రాచలంలో జరిగిన జాగృతి కథారచయితల సమ్మేళనంలోనూ, కడపలో జరిగిన అరసం మహాసభలలోనూ, విజయవాడలో జరిగిన ప్రపంచ రచయితల మహాసభలలోనూ పాల్గొనడానికి ఈ కథే కారణం అని నా ప్రగాఢ నమ్మకం. ఈ కథను తన కథాసాగరమథనంలో సమీక్షించిన తరువాతే కస్తూరి మురళీకృష్ణ గారితో పరిచయం ఏర్పడి అది గాఢ స్నేహంగా పరిణమించింది. ఇదే కథను కోపల్లె మణినాథ్‌గారు కథావిశ్లేషణపోటీ కొరకు విశ్లేషించారు. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కథావార్షిక 2008లో చదువదగిన కథల జాబితాలో చోటు చేసుకోవడం. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే నాలుగున్నరేళ్ల తరువాత నా కథ ప్రింటయింది. ఈ రోజు అంటే 30-12-2012 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా కథ తీగలాగితే... ప్రచురితమయింది. సరదాగా వ్రాసిన ఈ కథను చదివి మీ అభిప్రాయం చెప్పండి. 

24, డిసెంబర్ 2012, సోమవారం

పెద్దిభొట్లకు కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం!

ప్రముఖ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారికి ఇటీవల కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఈ రోజు సాక్షి సాహిత్యం పేజీలో వచ్చిన వ్యాఖ్య ఇక్కడ చదవండి.


పైన పేర్కొన్న అంతర్జాతీయ ప్రమాణాలను అవలీలగా అతిక్రమించిన కళాఖాండాలలో ఒకటి కథాజగత్‌లో ప్రకటించడం మా అదృష్టం.

18, డిసెంబర్ 2012, మంగళవారం

సలీం రెండోభార్య

కాంచన మృగం, కాలుతున్న పూలతోట, రూపాయి చెట్టు, నిశ్శబ్ద సంగీతం వగైరా రచనలతో పేరు పొందిన ప్రముఖ రచయిత సలీం గారి కథ  రెండోభార్య కథాజగత్‌లో చదవండి.  

7, డిసెంబర్ 2012, శుక్రవారం

రవీందర్ కథ

పసునూరి రవీందర్ కథ అవుటాఫ్ కవరేజ్ ఏరియా ఇప్పుడు కథాజగత్‌లో చదవండి. 

6, డిసెంబర్ 2012, గురువారం

వదరుబోతు

పానుగంటివారి సాక్షి వ్యాసాలకు ధీటుగా అనంతపురం ప్రాంతం నుండి 1917 ప్రాంతంలో వెలువడిన వదరుబోతు వ్యాసాలలో మచ్చుకు ఒకటి ఇక్కడ చదవండి.









4, డిసెంబర్ 2012, మంగళవారం

రాధేయకు నచ్చిన రచన!

సాహిత్య ప్రస్థానం మాసపత్రిక డిసెంబరు 2012 సంచికలో నచ్చిన రచన శీర్షిక క్రింద ప్రముఖ కవి, ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ గారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకం పై తమ అభిప్రాయాన్ని వ్రాశారు. ఆ వ్యాసం తాలూకు పూర్తి పాఠం ఇక్కడ చదవండి.

కరువు సీమ సాహితీరత్నం - విద్వాన్‌ విశ్వం !!

    అచట నొకనాడు పండె ముత్యాల చాలు

    అచట నొకపుడు నిండె కావ్యాల జాలు

    అచట నొకపుడు కురిసె భాష్యాల జల్లు

    విరిసెనటనాడు వేయంచు విచ్చుకత్తి...  అంటూ

    రాయలసీమ గతకాలపు వైభవాన్ని కీర్తించిన కవి విద్వాన్‌విశ్వం సీమవర్తమాన కన్నీటి చరిత్రను, వాస్తవిక చారిత్రక అనుభవాల్ని జీవన చిత్రాలుగా కళ్ళకు కట్టాడు. అంతేకాదు సీమ భవిష్యత్తులో ఏర్పడబోయే ఎడారిఛాయల్ని ముందే పసిగట్టి, పెన్నా తీర ప్రాంత ప్రజల కడగండ్లను ఆర్ధ్రంగా పలికిన కావ్యం 'పెన్నేటి పాట'ను సాహితీ చరిత్ర మర్చిపోదు. ఈ కావ్యం చదువుతున్నంత సేపూ 'సీమ ప్రజల గుండె తడియారదు'.



    విద్వాన్‌ విశ్వం గతాన్ని మాత్రమే చెప్పలేదు. మొత్తం మానవ సమాజం పట్ల అంతులేని ఆర్తికి పర్యాయపదమై పెన్నేటి పాటగా ప్రతిధ్వనించాడు. ఇందులో సహజమైన మానవ నుడికారం తొణికిసలాడింది.

    'సాహితీ విరూపాక్షుడు విద్వాన్‌ విశ్వం' పేరుతో ఆయన సాహితీ జీవితాన్ని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ, అంటూ నాలుగు అధ్యాయాలుగా విభజించి మన కందించిన సంపాదకులు డా. నాగసూరి వేణుగోపాల్‌, కోడిహళ్ళి మురళీ మోహన్‌ గార్లను మనసారా అభినందిస్తున్నాను. ఇందులో ఉద్దండులైన సాహితీవేత్తలు డా. దివాకర్ల వెంకటావధాని, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తిరుమల రామచంద్ర, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, ఆరుద్ర, దాశరధి వంటి ప్రముఖులు విద్వాన్‌ విశ్వం గారిని అంచనా వేసిన తీరును, వారి కావ్య ప్రతిభా పాండిత్యాలను విశ్లేషించే వ్యాసాలను పొందుపరిచారు. ఇవి వర్తమాన సాహితీ తరానికిఎంతో స్ఫూరిని అందిస్తాయి.  

    1956లో రాసిన పెన్నేటిపాట నేటికీ సజీవమైనదే. కళ తప్పిన పల్లెసీమలు, కనుమరుగైపోతున్న మన సాంస్కృతిక శోభను తలపింపజేస్తుంది. పల్లెసీమల వ్యథార్థ దృశ్యకావ్యమే పెన్నేటిపాటగా అవతరించింది. వస్తువు రూపంతో ఇతివృత్తం చక్కగా ఇమిడిపోయింది. ఎంత వివరించినా, ఎంత వ్యాఖ్యానించినా తరగని సాహిత్యపు గని. రాయలసీమ పలుకుబళ్ళు వారి నాలుక మీద నాట్యమాడాయి.

    సాహిత్య చరిత్రలో విశ్వంగారి స్థానం విశిష్టమైనది. వారు వ్యాసం రాసినా, పద్యం రాసినా, సమీక్షలు చేసినా తమదైన శైలితో, విషయ వైవిధ్యంతో తొణికసలాడుతూ వుంటాయి. పెన్నానదీ తీర ప్రాంతంలోని సీమ ప్రజల స్వభావాన్ని, వారి గుండె చప్పుళ్ళను సమాజానికందించారు. వారి రచనల్లో అడుగడుగునా వారి ప్రతిభావ్యక్తిత్వం గోచరమవుతుంది.

    ఎన్ని కావ్యాలు వచ్చినా జీవిత చిత్రణలో, భాషలో, భావ వ్యక్తీకరణలో రాయలసీమకు ప్రాతినిథ్యం వహించే కావ్యం పెన్నేటిపాట. కవితావేశంలో పెన్నేటి పాట. మహాప్రస్థానానికి దీటైన కావ్యం. ఇరవయ్యవ శతాబ్దంలో కండగల భాషను సృష్టించుకున్న అతి తక్కువ కావ్యాలలో 'పెన్నేటి పాట' ఒకటి అని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి పేర్కొన్నారు.

    విశ్వంగారు సంస్కృతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘసందేశం కావ్యాలను తెలుగులో చక్కటి రసానుభూతితో అనువదించాడు. అంతే కాదు విరికన్నె, మహాశిల్పి, నాహృదయం, మహాసంకల్పం వంటి కావ్యాలను రచించారు. ఆంగ్ల భాష నుండి, రష్యన్‌ భాష నుండి ఆధునిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. అంతేకాదు - ఆంధ్రప్రభ వారపత్రికలో వారి 'మాణిక్యవీణ'  విశ్వం గారి విశ్వరూపానికి అద్దంపడతాయి.

    జర్నలిజం కోర్సును భోధిస్తున్న అనేక విశ్వ విద్యాలయాల్లో ఈ వ్యాసాలను పాఠ్యాంశాలుగా పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది.  

    విశ్వంగారు, కావ్యంరాసినా, వ్యాసం రాసినా, గేయం రాసినా అది సామాజిక ప్రాధాన్యత సంతరించుకున్నదే తప్ప ఇతరంకాదు. నిజానికి ఆయనే ఒక మానవతావాది. పత్రికా రంగంలో ఉన్నతమైన విలువలను నిలబెట్టిన సత్సంప్రదాయవాది. కరువు సీమలో పుట్టిన కాంతరత్నం. 2015లో విద్వాన్‌ విశ్వంగారి శతజయంతిని జరుపుకోబోయే సందర్భంలోనైనా ప్రభుత్వం ఎటూ చెయ్యదు కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయమైనా లేదా సాహిత్య సంస్థలైనా పూనుకొని వారి వివిధ రచనల సమగ్ర సంపుటాలను తీసుకువచ్చే కృషిని ఇప్పటి నుండే ప్రారంభించాలని నా సూచన. కొంతలో కొంతయినా అబ్జక్రియేషన్స్‌ సంస్థ పక్షాన ఈ పుస్తకాన్ని వెలువరించినందుకు సంపాదకుల్ని మరోసారి అభినందిస్తూ వర్తమానతరం సాహితీ మిత్రులు విశ్వం గారి మానవతావాదాన్ని అందిపుచ్చుకోవడానికైనా ఈ పుస్తకాన్ని కొని, చదివి తీరాలి !

29, నవంబర్ 2012, గురువారం

బ్రతక నేర్వని వాడు!


కథ అని చెప్పుకోవడానికి అన్ని విధాల అర్హత ఉన్న కథ!

...............

నేను ఎంతో ఇష్టంగా టైపు చేసిన కథ!

.................

దాసరి అమరేంద్ర గారి బ్రతకనేర్వనివాడు కథ!

.................

ఇప్పుడు కథాజగత్‌లో!

...............

20, నవంబర్ 2012, మంగళవారం

పేరు సూచించండి!

డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి గురించి నేను డా.నాగసూరి వేణుగోపాల్‌తో కలిసి తీసుకువస్తున్న పుస్తకం ఓ కొలిక్కి వచ్చింది. సుమారు 200 పేజీలు ఉండే ఈ పుస్తకంలో తిరుమలరావు గారు వ్రాసిన విమర్శావ్యాసాలు, నాటికలు, కథ, గ్రంథ విమర్శలు, పీఠికలు, సంపాదక లేఖలు, వారు వ్రాసిన 'సాహిత్య తత్వము - శివభారతదర్శనము', 'కన్యాశుల్క నాటక కళ' గ్రంథాలపై వెలువడిన పీఠికలు, సమీక్షలు తిరుమలరావు గారి జీవిత విశేషాలను వివరించే వ్యాసాలు, అనుబంధంగా తిరుమలరావుగారి ఫోటోలు, భారతిలో వారి రచనల జాబితా వగైరా ఉంటాయి. వీటితో పాటు ఆయిల్ టెక్నాలజీ రంగంలో సర్దేశాయి గారు చేసిన పరిశోధనలూ, వారి ఆధ్వర్యంలో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థ సాధించిన విజయాలూ వివరిస్తూ ఒక బృహత్ వ్యాసం ఈ పుస్తకానికి హైలైట్‌గా ఉండబోతోంది. ఈ పుస్తకానికి ఒక మంచి పేరును సూచించవలసిందిగా బ్లాగు మిత్రులను కోరుతున్నాను. పేరు పెద్దగా ఉండకూడదు. 'క్యాచీ' ఉండాలి. సర్దేశాయి తిరుమలరావు ముందుగాని, చివరన గాని ఒక విశేషణం జోడిస్తే ఎలా ఉంటుంది? (సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం మాదిరిగా) మీ సలహా సూచనల కోసం ఎదురుచూస్తున్నాను.       

13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి కానుక!

తురుపుముక్క, కథాజగత్ పాఠకులకూ శ్రేయోభిలాషులకూ మిత్రులకూ  దీపావళి శుభాకాంక్షలు! ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి శ్రుతి కథ మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చదివి ఆనందించండి.

12, నవంబర్ 2012, సోమవారం

అద్వైతం

అనిల్‌ప్రసాద్ లింగం గారి కథ అద్వైతం కథాజగత్‌లో చదవండి.

11, నవంబర్ 2012, ఆదివారం

కల్పన కథపై వనజవనమాలి గారి విశ్లేషణ!


ఆకాశంలో సగం అని ఘనంగా చెప్పుకునే మహిళల  చదువులు - ఉద్యోగాలు కుటుంబం అనే రారాజుని గెలిపించడానికి గృహిణి కర్తవ్యం ని నెరవేర్చడానికి.. ఎలా బలి తీసుకోబడుతున్నాయో.. ఈ కథ చెబు తుంది  . .. పురుష అహంకార, వరకట్న, కుటుంబ హింస లోలోతుల్లో ఎలా ఇంకా వేళ్ళూనుకునే  ఉన్నాయన్న సంగతిని.. మరవకూడదనుకుంటూ..ఆ పరిధిలోనే స్త్రీల   జీవితాలు వాటికి అనుగుణంగానే  మారతాయని, ఇంకా చెప్పాలంటే  మార్చబడతాయని ఈ  కథ చెపుతుంది.  

కల్పన, సుదీర అనే ఇద్దరు విద్యాధికులు, మాజీ ఉన్నత ఉద్యోగినులు అయిన తల్లుల గురించి వారి ఆవేదనాభరితమైన ముచ్చట్లలో.. మనం ఈ కథని చదువుతూ..  మహిళల విద్యా ఉద్యోగ అవకాశాలని, శక్తి యుక్తులని సామర్ధ్యాన్ని పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే  కారణాలతో  తల్లి అనే  పాత్రని ఎంతో   ప్రేమ భరితంగాను చేస్తే  భార్యగా  బరువు-భాద్యతలు వారిని  ఎలా నిస్తేజంగా  చేస్తాయో తెలుసుకుంటాం.  మారని పురుష ప్రపంచ వైఖరిని గమనిస్తూ.. దుయ్యబడుతూ  ముందుకు సాగుతాం.

ఉన్నత ఉద్యగం చేసి లక్షలు సంపాదిస్తున్న కల్పనకి వరకట్న బాధ తప్పలేదు. అత్తగారి ఆజ్ఞానుసారాలు, ఆడబడచు ఆరళ్ళు, భర్త సహకార లేమి వీటన్నిటి మద్య.. అమితంగా నలిగి చదువు ఉద్యగం ఇచ్చిన భరోసాతో.. పోరాడి గెలిచినా మళ్ళీ వివాహమనే వ్యాపారములో.. లాభాన్ని లెక్కించుకుని.. భర్తతో కలసి ఉండటానికే ఇష్టపడుతుంది. ఇంటా-బయట చాకిరితో.. తల్లిగా తన అవసరాన్ని బిడ్డకి అందించలేని అసహాయతనంలో.. ఉద్యోగం వదులుకోవడం, భర్త అహంకారం లాటి విషయాలు  అన్నీ యెంత ఒత్తిడికి   గురిచేసి.. గృహిణిగా మిగిల్చాయో.. జీవితం  ఎంత వేదనా భరితం అయ్యిందో.. చదువుతుంటే.. ఇది  ఒక్క కల్పన సమస్య మాత్రమేనా అనిపిస్తుంది.  లక్షలాది మంది మహిళల కత్తిమీదసాములాటి  ఇంటి-ఉద్యోగ భాద్యత..లో.. నలిగి పోతున్నారో..అనిపిస్తుంది. పురుషుల సహకార లేమితో.. నలిగిపోతున్నఉద్యోగులైన  ఆడకూతుర్లే  కనిపించారు. 

చదువుకుని ఉద్యోగం చేసి,డబ్బు సంపాదిస్తున్నానే  ధీమాతో.. మొగుడికి ఎదురు తిరిగి మాట్లాడటం, కేసులు పెట్టడం చేస్తున్నారు. అది లేకపోబట్టే కాపురాలు చక్కబెట్టు కుంటాం అని తీర్మానిన్చుకోవడం కన్నా తప్పిదం ఇంకోటి   ఉండదేమో!  స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యం లభించవచ్చు. ఆర్ధిక స్వేచ్చ లేకుండా.. తమ సంపాదన అంతా.. భర్త చేతికి అందించి.. ఎన్ని ఇక్కట్లుని మౌనంగా సహిస్తారో.. చాలా సందర్భాలలో  మనం రుజువు పరచగలం. 

ఈ కథలో సుధీర  చెప్పిన  మానస కథ  ఆఖరికి సుధీర  కథ కూడా.. చదువుకుని ఉద్యోగం చేస్తూ..  రెండు పడవలపై కాళ్ళు ఉంచి జీవన ప్రయాణం చేయలేక  కుటుంబం కోసం, బిడ్డల కోసం  హౌస్ వైఫ్ గా మిగిలినవారే!  ఉద్యోగం పురుష లక్షణంగా.. మగవాళ్ళు మారనూ లేదు. స్త్రీలకి సహకారం అందించడం లేదు.  .కొంతలో కొంత ఈ కథ లో స్త్రీలు తమ ఆసక్తుల   మేరకు ఇకబెన క్లాస్స్ లకి వెళ్ళడం, దూర విద్యా కోర్సులలో చేరి చదువుకోవడం కొంత హర్షించ తగ్గ విషయమే! చాలా మంది స్త్రీలకి ఆసక్తి ఉన్నా అలాటి అవకాశం లభించనే లభించదు. అలాగే  కథ ముగింపులో స్త్రీల జీవితాలలో.. కనీసం  మంచి చెడు నిర్ణయం తీసుకోవడానికైనా... మన నిర్ణయం మనం తీసుకోవడానికి అయినా.. తప్పనిసరిగా చదువుకుని ఉండాలి అనడం కూడా ఆవేదనగానే ఉంది. చదివిన చదువులు, సంపాదించిన లోకజ్ఞానం అందుకు మాత్రమె ఉపయోగమా? సమాజంలో సగ భాగం అయిన స్త్రీకి సమాజ భాద్యత లేకుండా.. కుటుంబానికే పరిమితం కావడమో, కాబడటమో చీకటి లోకంలోనే ఉన్నట్లు అనిపించక మానదు. 

 నాకు ఈ కథలో నచ్చిన విషయం ఏమంటే  స్త్రీల అభివృద్ధి వెనుక దాగిన అణచివేత పై  తెలియని ఆవేదన ఉంది. అది మనలని చుట్టుముట్టుతుంది. ఆధునిక కాలం అమ్మాయిల చదువులు, ఉన్నత ఉద్యోగాలు.. సంపాదన అంటూ.. ఆకాశానికి.. ఎత్తేయడం.. అందరికి కనిపించే బాహ్యకోణం. ఇంటా బయట చాకిరి చేస్తూ.. పాత కొత్త తరాల మద్య సంధి కాలంలో..  స్త్రీలు ఎంత నలిగిపోతున్నారో అన్న దానికి..  కథ  దర్పణం పట్టింది. ఆర్ధిక సమానత్వం కల్గిన స్త్రీని.. భార్యగా అంగీకరించలేని.. సమాజంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు స్త్రీలకి..చదువు ఉద్యోగాలతో పాటు అన్నీ ఉన్నాయి.. వరకట్నం, వేధింపులు, ఆదిపత్య ధోరణి ని భరించాల్సి రావడం.. ఇంకా అనేక సాంఘిక సమస్యలు... అన్ని ఉన్నా.. స్త్రీ లో మాతృత్వం కి.. పెద్దపీట.. వేయడం. .స్త్రీఅత్వానికే చిహ్నంగా..  ముగింపు.. కధకి వన్నె తెచ్చింది.. వాస్తవం కూడా.. అదే..! కధని.. ఇంకా బాగా వ్రాయవచ్చు. కల్పన తన గురించి చెప్పడంలో.. ఇంకా సున్నితత్వం ఉండాల్సిన్చినదేమో అనిపించినది, అవసరమనిపించిది. అఫ్ కోర్సు..ఇన్ని సమస్యలని ఫేస్ చేసిన స్త్రీలకి.. సున్నితత్వం  కూడా పోతుందిఅనుకోవచ్చు. . .. చక్కని..కధ అని అనలేను.. వాస్తవములు..అంటాను. ఆ ఆవేదన తోనే ఈ కథని విశ్లేషించాను  కూడా..

 "తల్లిదండ్రుల తరం మారి ఆడపిల్లలు చదువుకోవాలని కొడుకులతో సమానంగా చదువు చెప్పించింది. కానీ చూశారా మగవాడు మారలేదు. మగవాడి తల్లిదండ్రుల పాత్ర మారలేదు. ఇప్పుడు మనకు అభ్యుదయం పేరిట అదనపు బరువు బాధ్యతలు''.   

ఇది నూటికి నూరు శాతం నిజం.

(వనజవనమాలి బ్లాగు సౌజన్యంతో)

వాసంత తుషారం

"మావాణ్ణి చూడటానికి వచ్చినారేమమ్మ మీరు - అదృష్టవంతుడమ్మా మావాడు - రండమ్మా రండి" అంటూ వెంకటలక్ష్మమ్మ సంబరపడటానికి కారణమేమిటి? తెలుసుకోవాలంటే ప్రముఖ కథకుడు సింగమనేని నారాయణ కథ వాసంత తుషారం కథను కథాజగత్‌లో చదవండి. తప్పక చదవాల్సిన కథ యిది. 

4, నవంబర్ 2012, ఆదివారం

'అంతర్ముఖం' అంతరార్థం!


అడపా చిరంజీవిగారి అంతర్ముఖం  కథ నాకు ఎంతగానో నచ్చింది. ఆత్మహత్యకు సిధ్ధపడ్డ వ్యక్తి  నిర్ణయం  మార్చుకుని ఆత్మహత్య వద్దని నిర్ణయింప చేసే కధలలో ఒకటి.   మనిషిలోని మనసుకి ఒత్తిడి, నిరాశ కలిగినప్పుడు దానినుంచి విముక్తి చెందటానికి,  శరీరాన్ని కూడా బలవంతంగా అంతం చేసి ఆత్మహత్య  ద్వారా అన్ని సమస్యలకీ  పరిష్కారం దొరుకుతుందను కోవటం  చాలా మూర్ఖత్వం. ఆత్మహత్య  పరిష్కారం కాదన్న  విషయాన్ని చాలా చక్కగా కథలో ఇమిడ్చారు. ఆత్మహత్య చేసుకునే ముందు పడే వేదనని రచయిత    క్లుప్తంగానైనా, ఎంతో బాగా వర్ణించారు.
జీవితమంటే జీవించ తగ్గదన్న అర్థం స్ఫురిస్తుంది. కాని జీవితంలో ఎంత మంది జీవితాలు జీవించటానికి హితముగానూ, జీవించ తగ్గవిగాను ఉన్నాయని ఆనందిస్తున్నారు అని ప్రశ్నిస్తే?... దానికి అనేకానేక హేతువులతోనూ, సమర్థింపులతోనూ  కొరతలతోనూ కూడుకున్న జవాబులు లభిస్తాయి. ఎంతో తాత్వికత కలిగిన మనుషులు తప్ప తమ జీవితాలను  నిండుగానూ తృప్తికరంగానూ పరిగణించలేరు. సాధారణ మానవులు తమ జీవితాలను నిండుతనం లోపించటానికి అనేకానేక కారణాలను పేర్కొంటారు.  కొందరు తీరని ఆశలని  పేర్కొంటే, మరికొందరు జీవిత పరమావధిని అందుకోలేక పోయామని బాధ పడవచ్చు. 
ఇహ పర సుఖాలను ప్రతివారు  వారి వారి  పరిధికి తగ్గట్టు కాంక్షించవచ్చు, కాని పుట్టిన ప్రతి జీవి తన మరణాన్ని గురించి తనకు తెలియకుండానే ఒక ఊహకి అందని కధని  అల్లుకుంటాడు. జనులంతా తమ ప్రమేయం లేకుండానే  ఈ భువిలోకి రావటం జరుగుతుంది... అలానే ఏదో ఒక నాడు తమ ప్రమేయం లేకుండానే ఈ జగతిని వీడి పోవలసి ఉంటుంది... ఈ రెండిటికీ కూడా కొందరు  భగవంతుడిని నమ్మితే మరికొందరు  ఏదో అలౌకిక శక్తి కారణమని నమ్ముతారు. మన జీవన    మరణాలను  మన కర్మలే నిర్ణయిస్తాయన్న  విషయాన్ని మన కర్మ సిధ్ధాంతం బోధిస్తోంది. సాధ్యమైనంత  సంతోషంగా మలచు కోవలసిన జీవితాన్ని అసంతృప్తితో అంతం చేసుకోవడం ఏ విధంగా న్యాయం ?   

ఆత్మహత్యకి సిధ్ధ పడ్డవారిచే అన్యులు బలవంతంగా  కారణాలని చెప్పించటం కాక ప్రశాంతతని సృష్టించి అతడి చేతే కారణాలని ఆసాంతం  ఋషివర్యుడు  చెప్పించిన శైలి  బాగుంది.
ప్రభుత్వ ఉద్యోగులు మితమైన ఆదాయంతో కనీస  అవసరాలని కూడా తీర్చుకోలేక, సమాజంలోని పలువురి విలాసవంతమైన జీవితాల్ని చూసి, తాము  కనీస  కోరికలను కూడా  తీర్చుకోలేక పోతున్నామేనని బాధ పడుతున్నట్లు దైనీయంగానూ, దాన్ని సమర్థిస్తున్నట్లు   సన్నివేశాన్ని సృష్టించి, దాన్ని   విశ్లేషణాత్మకమైన  కోణం వైపుకు మళ్ళించిన తీరు కధకే హైలైటు. ప్రతీ మనిషి జీవించటం ద్వారా సమాజంలో మరికొంత మందికి బతికే అవకాశం లభిస్తోందన్న పాయింటు పాఠకులని కూడా అలోచింప చేస్తుంది. ప్రతీ మనిషి తన స్థాయినుంచి పై  మెట్టుకి ఎదగాలన్న తపనతో పడే పోరాటాని సమర్ధిస్తున్నట్లు వ్రాస్తూనే, అసంబధ్ధమైన కోరికలు ఆవరించటమే అన్నిట్లకీ మూల కారణమని, వాటిని  తృణ ప్రాయంగా ఎంచి విముక్తి చెందిన నాడే జీవితం చరితార్ధమౌతుందని మునివర్యునిచే చెప్పించి, మార్మికమైన నీతిని, కథ ద్వారా బోధించారు రచయిత.  
అరి షడ్వర్గాలని జయించేటంతటి గొప్పతనం సామాన్య మనుషులలో లేక పోయినా ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలని  జయించటానికి తాత్కాలికంగా వాటిని వాయిదా వేయటమే  మంచి ఉపాయమని  సూచించించారు. మరీ పొడుగైన కథలు చదివే తీరిక యువతకి ఉండదు, క్లుప్తతలోనె కథా వస్తువు, నీతి విశ్లేషణ, ఇలా ఎన్నెన్నో చొప్పించిన ఘనత రచయితది.   హీరో ఆత్మహత్యని వాయిదా వేయడం అతన్ని అంతర్ముఖునిగా మారుస్తుంది...
జీవితంలో ధ్యేయాలని,  ఆకంక్షలని, ప్రేమించిన మనస్సులని అందుకోలేక డిప్రెషన్నుకిలోనై   నిరాశతో దుడుకుగా,  ఆత్మహత్యలనే  శరణు  జొచ్చుతున్న యువత,  తమ సన్నిహితులకి  తమ మరణం ఎంతటి దుఃఖానికి  గురి చేస్తుందో ఆలోచించి క్షణికమైన ఉద్రిక్తతను అదుపులో పెట్టుకున్నట్లైతే  ఎన్నెన్నొ యువ జీవాలు కాపాడ బడుతాయి. 
కథకి ముఖ్యుడైన హీరోకి గాని, ఋషివర్యునికి గాని, ఏ పేరూ  పెట్టకుండానే ఆ పాత్రధారులని గూర్చి లోతుగా చదువరిని  ఆలోచింప చేసే రచయిత కథా శిల్పం మెచ్చుకో తగ్గది. ఋషి అతడిని అంతర్ముఖినిగా చేసి ఆలోచింప చేసి, ఇంకే బోధనల్ని, జీవిత సులువుల్ని మళ్ళీ బోధించకుండా ధ్యానంలో మునిగి పోవటం కథకి ఎంతో గంభీరత్వాన్ని  అందిస్తుంది. 
హీరొకి మరణం నుంచి  విముఖత ఏర్పరచి బ్రతుకుపై ఇష్టం కలిగినప్పుడు వచ్చే ఉప్పెనలాంటి ఆనందానుభూతికి  పాఠకులని కూడా కొని పొయి హేతువాదాన్ని ద్రుఢ  పరిచిన రచయిత ప్రశంసనీయులు.  

- లక్ష్మీమాధవ్

(భావతరంగాలు బ్లాగు సౌజన్యంతో) 

29, అక్టోబర్ 2012, సోమవారం

కొడిగట్టరాని చిరుదీపాలపై శైలజామిత్ర విశ్లేషణ!


ఒకప్పుడు కుటుంబం ఆంటే అమ్మ నాన్న, పిల్లలు, వీలయితే నానమ్మ, తాతయ్య వారందరితో పాటు కనీసం నలుగురు లేదా కనీసం అయిదు మంది పిల్లలతో  అందరూ కలిసి ఉండేవారు. . నేడు ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా అమ్మ నాన్న  ఒకరో లేక ఇద్దరో పిల్లలతో జీవిస్తూ, అదే జీవితమని మురిసిపోయే రోజులు వచ్చాయి. పోనీ ఇదివరకటిలా అమ్మ వంటింటిలో కనిపిస్తోందా ఆంటే అదీలేదు. అమ్మ కూడా ఉద్యోగం పేరిట ఉదయం వెళితే రాత్రి వరకు రాకపోవడం, వచ్చిన కాసేపు అలసటగా ఏదో తిన్నాను అనిపించి నిద్రపోవడంతో కన్న బిడ్డలు ఎలా ఉన్నారు? స్కూల్ లో ఎలా ఉన్నాడు? అతని స్నేహితులు ఎవరు? ఎదిగిన పిల్లలయితే తాము లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారు? కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరితో చాట్ చేస్తున్నారు? ఇవన్నీ గాలికి వదిలేసారు. ఏదో పిల్లో పిల్లవాడో ఎవరైతేనేమి ఒక ఖరీదైన స్కూల్ లో చేర్చాలి. చేతికి అడిగినంత డబ్బు ఇవ్వాలి. అని ఆలోచిస్తున్నారే తప్ప మరేమీ ఈ కాలపు తల్లి తండ్రులలో కనబడటం లేదు.  అదీ కాకుండా ఉన్న ఒక్క బిడ్డని అతి గారాబం చేయడం కూడా ఒక తప్పుగా పరిణమిస్తోంది. విమల ఆనంద్ ది చక్కని జంట. పేరుకు తగ్గట్లుగా వారికో కుమారుడు పేరు విజయ్ తన చిన్నతనంలోనే తన తల్లి తండ్రులు తనతో ఏమాత్రం సమయాన్ని కేటాయించలేక పోతున్నారని బాధపడేవాడు. అలా అనుకుంటూనే అలవాటు పడిపోయాడు. అయితే ఎలా? పనికిరాని విడియో గేమ్స్ ఆడటం నేర్చుకున్నాడు. ఆంటే ఇక్కడ విడియో గేమ్స్ అన్నీ అలాంటివని కాదు. కొన్ని ఉదాహరణకు షాడో వారియర్, బ్లడ్, ఆర్మ గడ్దాస్ ,ఫ్రాన్కిన్స్టిన్ లాంటివి అన్నమాట. 
ఇవిలా ఉంచితే ఉన్నట్లుండి ఆ ఇంటికి పెద్ద దిక్కయిన ప్రకాశరావు ను తలపై మోది ఎవరో చంపేశారు. అయితే ఎవరు? డబ్బుకోసం కాదు. మరే ఇతర శత్రువులు అతనికి లేరు. మరెలా ఎవరు చంపారు? అనే ఆలోచనతో కొడుకు ఆనంద్ చాలాకాలం సతమతం అయ్యాడు. తర్వాత తాతగారు పోయినప్పటి నుండి రాజేష్ మౌనంగా ఉన్న కారణంగా వారి తల్లి తండ్రులు రాజేష్ ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకుని వెళతారు. ఒకవేళ ఆయన మరణం ఈ పసితనానికి షాక్ గా మారిందేమో అని వారి అనుమానం. గైనకాలజిస్ట్ అయిన రాజేష్ తల్లి విమలకు ఈ  డా. వర్మ క్లాస్ మాటే అదీ కాకుండా స్నేహితుడు కూడా. దాంతో మరింత శ్రద్ధతో గమనిస్తాడని వీరు తీసుకుని వచ్చారు. కాస్సేపు మౌనంగా ఉన్నా మరి కాస్సేపు మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టి తన అలవాట్లను, తనకు తాతయ్యకు మధ్య నిరంతరం సాగే ఆటలు గురించి చెప్పడంలో ఆ చిన్న వయసులోనే ఆ ముఖంలో ఏదో తెలియని ఉన్మాదం డాక్టర్ గమనించాడు.అప్పటికి అనవసరమేమో ఆనుకున్నా తల్లి విమల తీసుకుని వెల్లి పోయినా మరుసటి రోజూ రాజేష్ ఆడే ఆటలు గమనించాలని ఇంటికే డాక్టర్ రావడం జరిగింది. ఇక ఆపై రాజేష్ అదే వికృతమయిన ఆటలను చూసి ఆశ్చర్యపడి ఏదో అనుమానంతో  డాక్టర్ వర్మ షాడో వారిఎర్ లో తనను మించి స్కోరు ఎవరికీ రాదని అంటుంటే డాక్టర్ కూడా ఆడటమే కాదు. ఏకంగా రాజేష్ ను దాటిపోవడం కూడా జరిగింది. దాంతో తట్టుకోలేని రాజేష్, డాక్టర్ గొంతు పట్టుకున్నాడు. ఆవేశంతో ఆ ముఖం ఎర్రబడి వికృత రూపం దాల్చడంతో వెంటనే అక్కడే ఉన్న తల్లితండ్రులు పట్టి ఆపేరు. విశ్రాంతిగా పడుకోపెట్టారు. తల్లిగా విమల విల విల లాడింది.
డాక్టర్ వర్మ, రాజేష్ ను  మెల్లగా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఒక్కో ప్రశ్న అడుగుతుంటే  తాత తో తాను ఆడటం, ఎప్పుడూ ఓడిపోయే తాత గెలిచిపోతుండటం తాను తట్టుకోలేక పోయానని. అందుకే అక్కడే ఉన్న ఇనప క్యారిఎర్ తో తలపై మోదానని దాంతో తాతయ్య  అదీ మళ్లీ లేవకుండా పోయాడని చెప్పడం విని అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు.
 ఈ కధలో వస్తువు బావుంది. శిల్పం బావుంది.  నేడు సమాజానికి ఒక హెచ్చరిక గా కూడా ఉంది.  నేడున్న విజ్ఞానం ఎంతగా శాడిజం పిల్లలలో పెంచుతోందో తెలియజేసారు. తల్లి తండ్రులు కేవలం డబ్బు సంపాదించే మెషీన్స్ లా తయారవ్వడం ద్వారా పిల్లల మానసిక స్తితి ఎంతగా విక్రుతరుపం దాల్చుతోందో తెలియజేసారు. కాకుంటే కధా గమనంలో డాక్టర్ ను ఒకచోట వర్మ అని మరోచోట రమేష్ అని చెప్పడం పొరపాటుగా జరిగిందేమో కాని కధా పరంగా ఈ కధ సామాజిక దృక్పధం కలిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. 



కధను పూర్తిగా చదవడానికి చూడండి  

(శైలి బ్లాగు సౌజన్యంతో)

సూర్యలో నా వ్యాసం!


27, అక్టోబర్ 2012, శనివారం

నాయుడుగారి కథ!

సాదనాల వేంకటస్వామి నాయుడు గారి కథ వేటగాడు కథాజగత్‌లో చదవండి. కథపై మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషం. 

24, అక్టోబర్ 2012, బుధవారం

విజయ దశమి శుభాకాంక్షలు!!!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు వారి కుటుంబసభ్యులు అందరికీ తురుపుముక్క విమిపర్వదినాన శుభాకాంక్షలను తెలియజేస్తున్నది.

21, అక్టోబర్ 2012, ఆదివారం

పాప కోరిక

కరీంనగర్ జిల్లాకు చెందిన కవయిత్రి,కథారచయిత్రి అయిన శ్రీమతి గరిశకుర్తి శ్యామలగారి పాపకోరిక కథను కథాజగత్‌లో చదవండి.

19, అక్టోబర్ 2012, శుక్రవారం

నా కథపై మణినాథ్ కోపల్లె గారి విశ్లేషణ!


బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్)


కథ విశ్లేషణకి ఎంచుకున్న కథ ఇది.

సాధారణంగా ట్రైన్ ఆక్సిడెంట్ జరిగింది... అంటే....
ముందుగా వచ్చే ప్రశ్న ఎంతమంది మరణించారు?
ఆస్తి నష్టం ఎంత..?
ఆక్సిడెంట్ ఎలా జరిగింది..?
ఎవరైనా కావాలని చేసారా?
ఎవరైనా పెల్చేశారా?

ఇలా అంతు లేని ప్రశ్నలు... జవాబు లేని ప్రశ్నలు... ఉద్భవిస్తాయి కాని సంఘటనని పరిశీలించిన తరువాతే ఫలితాలు వెల్లడి తెలుస్తాయి.

ప్రయాణికుల భద్రతా... ప్రయాణికుల అసౌకర్యాలు.... ఎంక్యిరీస్ ఇలా ఎన్నో ఉపద్రవాల మధ్య రైలు ప్రమాదం గురించిన ప్రశ్నలు ఉద్భవిస్తాయి ....

కాని ఎవరి ప్రమేయం లేకుండా ప్రకృతి వల్ల కూడా రైల్వే ట్రాక్ డామేజ్ అవుతే కుడా మేజర్ accidents అయ్యే అవకాశం వుంది.

రచయిత ఆ విషయాన్ని చెప్పలనుకున్నారు.

రైలు పట్టాల మీద నడిచినంత సేపు బాగానే వుంటుంది.

అలా వెళ్ళటానికి వెనక ఎందరి కృషి వుంటుందో ఈ కథ తెలుస్తుంది.

రెండు పట్టాల మధ్య సరియైన సయోధ్య లేకపోతె రైలు పట్టాలు తప్పుతుంది.

కథలో రైల్వే సూపర్ వైజర్ రహమతుల్ల 60 డిగ్రీల మండు టెండలో తన డ్యుటీలో భాగంగా రైల్వే ట్రాక్ చెక్ చేస్తున్నపుడు... ముందుగా

కొన్ని రైలు పట్టాల మధ్య కంకర సరిగా లేక పోవటం గమనిస్తాడు. అందుకు రైల్వే ట్రాక్ లో కొంత భాగం సిమెంట్ స్లీపెర్స్, కొంత భాగం స్టీల్ స్లీపెర్స్ వుండటం వల్ల కంకరకి పట్టు ఉండక జారిపోటం, మట్టి మిగిలిపోవటం అవుతుంటుంది.దానికి కారణం (కంకర) బాలస్ట్ తక్కువ కావటం, పని ఒప్పుకున్నా కాంట్రాక్టర్ పని సగం లో వదిలేసి వెళ్ళిపోటం అని అనుకుంటాడు

"అసలు తన చేతి కింద ముప్పైమూడు మంది గ్యాంగ్‌మెన్లు ఉన్నా ఎప్పుడు సగానికి పైగా ఇతర పనులకు పురమాయిస్తాడు తన జూనియర్ ఇంజినీర్ (జే.ఇ) లింగారెడ్డి. మిగతా వాళ్లలో లీవు పెట్టిన వాళ్లు, పనికి ఎగనామం పెట్టిన వాళ్లు పోనూ గ్యాంగ్ బలం ఏడెనిమిది మంది కంటే మించదు. ఇంత తక్కువ మందితో పని నెట్టుకు వస్తున్నా పై అధికారులనుండి మాటలు పడటం తప్పలేదు" అని అనుకుంటాడు

మరి కొంత దూరం వెళ్ళినపుడు రైల్ పట్టాలు వంగిపోయి, వంకర్లు తిరిగి వుండటం చూస్తాడు. బక్లింగ్ అంటారు దాన్ని. అదే సమయం లో అదే ట్రాక్ పైకి ఎ.పి express వచ్చే సమయం అవటం వచ్చే ఉపద్రవాన్ని ఎలా ఆపాలో అర్థం కాదు రహమతుల్లకి .. అయినా వెంటనే స్పందించి కూలీ లని పిలిచి, హేల్పెర్ లని పిలిచి డేంజర్ ఫ్లాగ్ ని రైల్ పట్టాల పై పాతిస్తాడు. ఆ పని పూర్తి కాకుండానే రైల్ వచ్చేస్తుంది. లక్కీ గ రామయ్య పాతిన డిటో నేటేర్స్ ని పేల్చు కుంటూ రైల్ ఆగి పోతుంది. ఒక్క రెండు మూడు మీటర్స్ దాటితే పెద్ద ప్రమాదం సంభవించేది. డ్రైవర్ సమయానికి స్పందించటం వాళ్ళ ఆ రైలు ఆగిపోతుంది.

రైల్లోని జనం ఊపిరి పీల్చుకుంటారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు...

ఆ తరువాత రైల్వే ట్రాక్ బాగు చేయటానికి రహమతుల్ల చాల కష్ట పడతాడు.

వంగిపోయిన రైల్ పట్టాలు కట్ చేసి వేరేవి అతుకు వెయ్యాలంటే చాల సమయం పడుతుంది.

పరిస్తితి అర్థం చేసుకున్న రహమతుల్ల వెంటనే జే. యి. తో ఫోన్ లో మాట్లాడి కట్టింగ్ మేచిన్ , వెల్డింగ్ మేచిన్ కావాలని అడిగి తెప్పించటం. పని వాళ్ళు, కట్ చేసిన రైల్ ముక్కల్లో (పట్టా ముక్కలు ) కొత్త రైల్ పట్టా అతుకు వేయటం... ఇలా చాల పనులు వేగవంతం చేసి... పట్టాలు బాగు చేసి express రైల్ ని క్షేమం గా గమ్యం చేరేటట్లు చేస్తాడు.

ఈ సమయంలో అనేక రైళ్ళకి రాక పోకలకి అంతరాయం కలుగుతుంది.

కాని సమయ స్ఫూర్తి తో superviser రహమతుల్ల చేసిన పని అక్కడున్న వారందరూ శ్లాఘిస్తారు.
ఆ ఆనందం తో మనస్పూర్తి గా సంతృప్తితో ఇంటికి వెళ్ళిన అతనికి ఆ తరువాత పై అధికారుల నుంచి మేమో వస్తుంది. డ్యూటీ సరిగా చేయనందుకు.... అనేక రైళ్ళ సమయాలకు ఆటంకం కలిగినందుకు
ప్రయానికులకి తీవ్ర అసౌకర్యం కలిగినందుకు. అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా వచ్చిన ఉత్తర్వు అది.....

కాని ఈ కథలో రహమతుల్ల చేసిన దేశసేవ, అలుపెరగని నిస్వార్ధం, పని మీద ఏకాగ్రత, ప్రమాదం జరగ కుండ చుసిన సమయ స్ఫూర్తి, కొన్ని గంటల పాటు మండు టెండలో విశ్రాంతి లేకుండా పని చేయటం, చేసే పనిలో సాధక బాధకాలు. అన్ని అతనికే తెలుసు.

ఇతని సేవని గుర్తించని ప్రభుత్వం తిరిగి అతని పైనే చర్య తీసుకోవాలనుకోవటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఉదయిస్తుంది.

జరిగిన సంఘటన పై విచారణ లేకుండా.... న్యాయ విచారణ లేకుండా అతనికి ఉతర్వ్యులు పంపటం ఈ కథకి కొస మెరుపు.

ఈ కథలో రచయిత రైలు కి సంబంధించిన అనేక పదాలు వాడారు.

సామాన్యులు ఆ పదాలని అర్థం చేసుకుంటే ఈ కథ లోని సారాంశం బోధ పడుతుంది.

చాల కథలలలో మాదిరి కుటుంబ కలహాలు, సూటిపోటి మాటలు అనవసర సంభాషణలు మనకి ఈ కథ లో కనిపించవు.

కథ లో వాడిన terminology చాల కొత్తగా వుంది..

ఈ కథ కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని అనటం లో సందేహం లేదు.

రచయిత ఈ కథలో వాడిన ఆంగ్ల పదాలు కొన్ని .......

బావుటా, డిటొనేటర్లు 'బ్యానర్ ఫ్లాగ్ డౌన్ లైన్, బ్లాక్‌స్మిత్ ఎస్.ఇ.,ఏ.డి.ఇ. మోపెడ్ ట్రాలీ కళాశిల,
ట్రాక్‌, స్ట్రెసస్ ,మూడో స్లీపరు క్లిప్పులు, కె.ఎం.పి.హెచ్, క్లిప్పులు, అలైన్‌మెంట్ ప్యాకింగ్ గ్యాస్ కటింగ్, హాక్‌సా బ్లేడ్ల, రైలు , డీ స్ట్రెస్సింగ్‌ ప్లాన్, వెల్డింగ్, కాషన్ఆర్డర్‌ .... ఇలా ఎన్నో అర్ధమయ్యే చిన్న చిన్న నూతన (ఆంగ్ల) పదాలు కథలో వాడుకున్నారు.....

ఈ కథ తెలుగుదే అయినా పైన ఉదహరించిన పదాలకు తెలుగులోనే చెబితే అర్థం మారిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఆంగ్ల పదాలయితీనే సరిగా వాడుకోవటం జరుగుతుంది.


ఈ కథ నిజంగా నూతన కథాంశం అనటం లో సందేహం లేదు.


రైలు అంటే రైలు బండి, రైలు పట్టాలు అనే అందరు అనుకుంటారు 
కాని ఒక రైలు పట్టాల పైకి రావాలంటే ఎందరి కృషో అవసరమని ఈ కథ ద్వార అర్థమవుతుంది. 




మణి కోపల్లె

(వసంతసమీరం బ్లాగు సౌజన్యంతో)


18, అక్టోబర్ 2012, గురువారం

భరాగో కథపై జి.యస్.లక్ష్మిగారి విశ్లేషణ

   ఉపకారికి ఉపకారం చెయ్యడం ఏమంత పెద్ద విషయం కాదనీ, అపకారికి ఉపకారం నెపమెన్నకుండ చెసేవాడు నేర్పరి అనీ సుమతీశతకకారులు చెప్పారు.
   కాని ఈ కథ పేరే ఉపకారికి అపకారం చెయ్యడం.
   సుమతీ శతకకారుల్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటాను రచయిత పద్యం లో వచ్చేసంధి కలిసినట్లుగానే "నుపకారికి నపకారము!" అనే శీర్షిక పెట్టేరు.
   ఉపకారికి ఉపకారం చెయ్యడం అన్నది అంత పెద్ద విషయమేమీ కాదనీ, అపకారికి ఉపకారం చెయ్యడమే జీవితంలో ధన్యమైనదని సుమతీశతకకర్త చెప్పిన సూక్తి మనకి నరనరంలోనూ జీర్ణించుకుపోయింది.
   కాని ఇక్కడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు అదే సూక్తిని మరో కోణం నుంచి ఆవిష్కరించారు.
   "ఉపకారికి కూడా ఒక్కొక్కసారి అపకారం జరిగితే.." అన్న పాయింట్ తీసుకుని దానికి తగ్గట్టు పాత్రలను మలచి కథ నడిపారు.
   భమిడిపాటి రామగోపాలం ఎంత గొప్ప కథకులో తెలియనివారుండరు.
కథంతా ఉత్తమపురుష (first person) లో సాగుతుంది. సౌలభ్యం కోసం ఆయనను మనం పెద్దమనిషిగా పిలుచుకుందాం. ఎప్పుడో ఆయన శృంగవరపుకోటలో పోస్టాఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు, కుర్రాళ్ల బాధ్యతా రాహిత్యం గూర్చి చెపుతూ పోస్ట్ మాస్టర్ రిజిస్టర్డ్ కవరు ఇవ్వద్దని చెప్పినాకూడా, అఖిలాండేశ్వరం అనబడే అతనికి ఈ పెద్దమనిషి కేవలం మానవతా దృక్పథంతో ఆ కవర్ ఇస్తాడు. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు దాటిపోలేదు కూడా. అలాగ ఆలోచిస్తే అతను అతని రూల్ ని అతిక్రమించలేదనే చెప్పుకోవాలి. అలా ఈ పెద్దమనిషి ఉత్తరం సమయానికి ఇవ్వడం వల్ల అఖిలాండేశ్వరం సమయానికి ఇంటర్వ్యూ కి హాజరయి, సెలక్టయి, అంచెలంచెలుగా పైకెదుగుతూ, పెద్దమనిషి రైల్లో కలిసే సమయానికి ఉద్యోగాలకి సెలక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు.
ఆ అఖిలాండేశ్వరమే ఈ పెద్దమనిషి కొడుకు ఉద్యోగం పనిమీద హైదరాబాదు వెడుతున్నాడని తెలుసుకుని, ఆపని తన చేతిలో పనే అని చెప్పి, ఉపకారికి ఉపకారం చేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలు చెప్పి తనని కలవమంటాడు.

     అంతా బాగానే అవుతుంది. పెద్దమనిషి కొడుకుకి ఉద్యోగం వస్తుంది. స్వయంగా ఆర్డర్ తీసుకునే ఊరు వెడదామని ఆయన హైద్రాబాదు లోనే వుండిపోయినప్పుడు ఈ అఖిలాండేశ్వరం పర్సనల్ సెక్రటరీ నని చెప్పి గంగాధరం అనే ఆయన ఈ పెద్దమనిషిని కలిసి, అబ్బాయి ఆ ఉద్యోగంలో ఎంత తొందరలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో చెప్పి, తెలిసినవాళ్ళు కనక అందరిలా రెండు లక్షలు ఇవ్వకపోయినా యాభైవేలైనా ఇస్తే బాగుంటుందనీ, ఆ యాభైవేలూ కూడా ఈ పెద్దమనిషి ఎలా సమకూర్చుకోవాలో కూడా సలహా చెప్తాడు.
      ఆ పెద్దమనిషికి విషయం అర్ధమౌతుంది. కొడుకు ఉద్యోగస్తుడవడానికి గంగాధరం కోరినట్టే యాభైవేలూ పట్టికెళ్ళి కమీషనర్ గారికిచ్చి, అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకునే క్షణం లోనే అనుకోని సంఘటన జరుగుతుంది.
అవినీతి నిరోధకశాఖలో డిప్యూటీ సూపరెంటెండేంట్ గా పనిచేస్తున్న ఆ పెద్దమనిషి అల్లుడుగారు హఠాత్తుగా ప్రత్యక్ష్యమయి, ఆ అఖిలాండేశ్వరుణ్ణి రెడ్ హేండెడ్ గా పట్టుకుంటారు.
సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా సేకరిస్తారు.

ఆ విధంగా ఉద్యోగమిచ్చి ఉపకారం చేసిన అఖిలాండేశ్వరానికి అపకారం జరిగింది.
      కథలో ఈ మలుపు రచయిత హఠాత్తుగా తీసుకొస్తారు. విషయం అర్ధమయ్యే లోపలే సాక్ష్యాలు సేకరించబడతాయి. ఆ విషయం ఆ పెద్దమనిషికి కూడా అప్పుడే తెలుస్తుందనుకోవాలి. ఎందుకంటే పాఠకులకి కూడా ఆ పెద్దమనిషి అల్లుడు అవినీతి నిరోధకశాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్టు అప్పుడే తెలుస్తుంది. అలా లంచం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగిని పట్టుకుంటూ సాక్ష్యాధారాలను సేకరించడంతో కథ ముగుస్తుంది. 

       అంతటి గొప్ప రచయిత ప్రతిభంతా ఆ ముగింపులోనే కనిపిస్తుంది.
ఎందుకంటే ఒక కథ మంచికథ అని చెప్పుకోవాలంటే కథ చదవడం పూర్తయిన తర్వాత పాఠకుడు ఆ కథ గురించి కాస్త సేపైనా ఆలోచిస్తేనే దానిని మంచికథ అంటారని పెద్దవాళ్ళు చెపుతుంటారు. అలాగే ఈ కథ పూర్తి చేసాక కూడా దీనిగురించి ఆలోచించకుండా వుండలేరు. ముందు అందరికీ వచ్చే సందేహం ఈ విషయం ఆ పెద్దమనిషికి ముందే తెలిసుంటుందా అని. కాని ఆ పెద్దమనిషి కూడా ఆర్డర్ కాగితాలు తీసుకుని అలాగే నిలబడడంతో ఆయనకు తెలీదనే అనుకోవాలి.

      ఈ కథని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే మనిషి ఒకటనుకుంటే పరిస్థితులు దానిని మరోవిధంగా మార్చేస్తాయి అని. పాత్రలను తీసుకోవడం లోనూ, సన్నివేశాలను సృష్టించడంలోనూ రచయిత ప్రదర్శించిన తీరు అమోఘం.
     తనకి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకునే అవకాశం వచ్చినందుకు అఖిలాండేశ్వరుడు ఆనందించి, మిగిలిన అభ్యర్ధుల దగ్గర రెండు లక్షలు తీసుకుంటున్నా ఈ పెద్దమనిషి సహాయానికి ప్రతిగా కేవలం యాభైవేలే తీసుకుంటాననడం ఆ పాత్రకి తగ్గట్టే వుంది. అలాగే పెద్దమనిషి కూడా ప్రస్తుత పరిస్థితులని అర్ధం చేసుకుని ఆ డబ్బుని తీసికెళ్ళి అతని కివ్వడం కూడా సబబుగానే వుంది. ఈ విషయం తెలిసిన అవినీతిశాఖ లో ఉద్యోగి (పెద్దమనిషిగారి అల్లుడు) తన డ్యూటీ ప్రకారం లంచం పుచ్చుకుంటున్నవాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం విధిని నిర్వహించెనట్టే అనిపించింది.
    ఇలా ఏ ఒక్క పాత్రనూ తక్కువచెయ్యకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఉపకారికి అపకారం జరిగినట్టు రచయిత చాలా గొప్పగా చెప్పారు.
     మనిషి ఏం చెయ్యాలనుకున్నా పరిస్థితులకి ఎంత బానిసో, ఉపకారం చేసినవారికి కూడా ఎలా అపకారం జరుగుతుందో ఎంతో సూటిగా చెప్పారు.
ఈ కథ అందుకే నాకు నచ్చింది. మహారచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు కథని ఎంతో పట్టుగా, సూటిగా నడిపారు. అనుకోని మలుపుతో ఇచ్చిన ముగింపు కథ పూర్తిచేసాక పాఠకుణ్ణి తప్పకుండా ఆలోచింపచేస్తుంది.



ఈ కథకి లింక్...http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nupakariki-napakaramu---bhamidipati-ramagopalam


15, అక్టోబర్ 2012, సోమవారం

సూర్యలో నా వ్యాసం!

    సూర్య దిన పత్రిక 8 అక్టోబర్ 2012 సంచికలో సాహిత్యం పేజీ అక్షరంలో నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు అనే శీర్షికతో ఒక వ్యాసం వచ్చింది. డా.శ్రీనివాస్ అంకే ఈ వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ చదవండి. ఈ వ్యాసం పై నా స్పందనను పరిమిత విశ్లేషణ పేరుతో ఈ రోజు సూర్యదినపత్రిక అక్షరం పేజీలో ప్రకటించారు. దాని పూర్తి పాఠం ఇక్కడ యిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.


        అక్టోబర్ 8 సంచికలోని అక్షరం పేజీలో డా.శ్రీనివాస్ అంకే గారి 'నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు' అనే శీర్షికలో 'కవిత్వవేది' కల్లూరు వేంకటనారాయణరావుగారి గురించి వ్రాసిన వ్యాసం చదివి చాలా సంతోషించాను. రావుగారి 'ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము', 'వీరేశలింగ యుగము' అనే గ్రంథాల గురించి రచయిత చక్కగా విశ్లేషించారు. 


    అయితే ఈ వ్యాసంలో డా.శ్రీనివాస్ గారు ఎంత సాహిత్య చరిత్రకే పరిమితమైనా కల్లూరు వేంకటనారాయణ రావుగారి ఇతర రచనలను ప్రస్తావించక పోవడం వల్ల కల్లూరు వారిని కేవలం సాహిత్య చరిత్రకారుడిగా మాత్రమే పాఠకులు భావించే ప్రమాదం వుంది. వ్యాసంలో ఒక చోట 'ఆయన వ్యక్తిగతంగా పద్య కవి కూడా' అని పేర్కొన్నప్పటికీ అది సరిపోదు. 


        బోధార్షే అనే గుప్తనామం కలిగిన కల్లూరు నారాయణరావుగారు పై రెండు గ్రంథాలేగాక అహల్యా సహస్రాక్షీయము, శ్రీ కృష్ణార్జునీయము అనే నాటకాలనూ, పుష్పాంజలి, శ్రీ విద్యారణ్య చరితము, షాజహాన్, శ్రీమదశోక చరిత్రము మొదలైన పద్యకావ్యాలను వ్రాశారు. ఈ రచనలన్నింటిలోనూ తలమానికము అనదగింది అశోకచరిత్రము. శాంతి సామ్రాట్టు అనే నామాంతరం కల ఈ చారిత్రక పద్య కావ్యము భారత జాతీయోద్యమ స్ఫూర్తితో రాయలసీమ నుండి వెలువడిన చారిత్రక ప్రబంధ త్రయములో ఒకటిగా పేరుపొందింది. దుర్భాక రాజశేఖర శతావధాని గారి రాణాప్రతాప సింహ చరిత్ర, గడియారం వేంకట శేషశాస్త్రి గారి శివభారతము మిగిలిన రెండు చారిత్రక ప్రబంధ కావ్యాలు. ఈ అశోక చరిత్రను రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నిడదవోలు వెంకటరావు, తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, నండూరి రామకృష్ణమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతులు ప్రశంసించారు. ఏడు కాండములు, 1400 పైచిలుకు పద్యాలతో శోభిల్లిన ఈ మహాకావ్యాన్ని డా.శ్రీనివాస్ గారు తమ వ్యాసంలో కనీసం మాట మాత్రంగా నైనా ప్రస్తావించక పోవడం శోచనీయమే కాదు కవిత్వవేదికి చేసిన అపచారం కూడా!

       ఇక ఈవ్యాసం చివరలో 'రాయలసీమలో కవిత్వవేది తర్వాత సాహిత్య చరిత్ర రచన చేసినవారు కల్లూరు అహోబలరావుగారు' అని అంటున్నారు. వేంకటనారాయణరావుగారి వీరేశలింగ యుగము అహోబలరావుగారి రాయలసీమ రచయితల చరిత్రల మధ్య ఈ ప్రాంతం నుండి మరికొన్ని సాహిత్య చరిత్రకు సంబంధించిన రచనలు వచ్చాయి. అవి టేకుమళ్ళ కామేశ్వరరావు(వీరు విజయనగరానికి చెందిన వారయినా రాయలసీమలో ఎక్కవ కాలం జీవించారు) గారి 'నా వాఙ్మయ మిత్రులు', 'పూర్వ కవుల చరిత్ర', జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి 'మా సీమకవులు'. 


     రాయలసీమ రచయితల చరిత్ర గురించి డా.శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాన్ని చెబుతూ ఇందులో కులం, గోత్రం, వంశం వంటివాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సాహిత్యానికి ఇవ్వలేదని అంటున్నారు. అలాగే ఇందులో కేవలం  కవుల రచనలు, ఒకటి రెండు పద్యాలను ఉటంకించడంతో జనాదరణ పొందలేదని అభిప్రాయపడుతున్నారు. చరిత్ర అన్నాక తారీఖులు, దస్తావేజులూ, కులగోత్రాలు, వంశ చరిత్రలతో సహా అన్ని విషయాలనూ రికార్డు చేయవలసి ఉంటుంది. వాటివల్ల ప్రస్తుతం మనకు ఉపయోగం కనిపించకపోయినా ఏనాటికైనా వాటి అవసరం రావచ్చు. రాయలసీమ రచయితల చరిత్ర ఉద్దేశాన్ని కల్లూరు అహోబలరావుగారు తమ సంపాదకీయంలో స్పష్టంగా చెప్పారు. 'హూ ఈస్ హూ ఆఫ్ రాయలసీమ రైటర్స్' అను ఈ రాయలసీమ రచయితల చరిత్ర పరిశోధనా గ్రంథముగా పరిశోధకులకు ఉపయోగపడుతుందని అహోబలరావుగారు తలచారు. భావితరము వారికి, చరిత్రకారులకు ఈ గ్రంథము ఎన్సైక్లోపీడియా వలె ఉపయోగపడాలని భావించారు. కవిత్వవేది కల్లూరు వేంకటనారాయణరావుగారు రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటానికి వ్రాసిన మున్నుడిలో 'ఉత్తమ గ్రంథ రచయితలను చదువరులకు పరిచితులుగా జేసియున్కి, యెంతయు ప్రశంసనీయము. అందునను వారివారి జన్మదేశకాలములను, అందిన సన్మానములను వారి సహజ స్వభావములను, చక్కగా స్పష్టముగా, నభివర్ణించుటయే కాక, వారివారి కృతులలోని పద్యరత్నములను కూడ నాంధ్రులకు తనివిదీర నుదాహరణము లిచ్చియుండుట సమంజసముగా నున్నది' అని అంటున్నారు. 


  అహోబలరావుగారికి ఉన్న పరిమిత వనరులతోనూ, గ్రంథ విస్తరణభీతితోనూ రచయితల పరిచయాలు కొన్ని క్లుప్తంగా చేసిఉండవచ్చు కానీ ఈ నాలుగు సంపుటాల రాయలసీమ రచయితల చరిత్ర  డా.శ్రీనివాస్ అంకే గారి దృష్టిలో జనాదరణ పొందక పోయినా దాని ఆశయాన్ని పూర్తిగా నేరవేర్చినదని ఒప్పుకోక తప్పదు. సాహిత్య చరిత్రకు, పరిశోధనకు కావలసిన దినుసు ఈ సంపుటాల్లో పుష్కలంగా లభిస్తుంది. రాయలసీమలో పరిశోధకులకూ, విమర్శకులకూ అప్పటికీ, ఇప్పటికీ కొదవలేదు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

పాలకంకుల శోకం ; (


సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి పాలకంకుల శోకం కథను కథాజగత్‌లో చదవండి.

6, అక్టోబర్ 2012, శనివారం

సంస్కారంపై మణిగారి అభిప్రాయం!


       కథాజగత్‌లో "సంస్కారం" అనే కథ "కాకాని చక్రపాణి" గారిది!

ఈ కథ పై నా విశ్లేషణ :

        మనిషికి సంస్కారం ఎంతో అవసరం. ఈ మాట అందరు ఎరిగి ఉన్నదే! ఆ సంస్కారం కుసంస్కరమా కాదా అని తెలిసేది ఆ వ్యక్తీ ప్రవర్తనని బట్టి వుంటుంది. పెరిగిన వాతావరణం నుంచి వుంటుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినదనటానికి నిదర్శనం ఈ కథ 

        బతికినన్నాళ్ళు భార్య భర్తల అనురాగాలు కుటుంబ ప్రేమాభిమానాలు ఒక బంధం లోనే ఇమిడి ఉండేవి. స్త్రీలు కూడా ఎన్నో   బాధలు   పడ్డా తన కుటుంబం కోసం చాల త్యాగాలు చేసేవారు. కాని భర్త అంత్య దశలో కూడా ('పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. ) మనుషుల ఆలోచనల్లో  మార్పు వచ్చిందనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. పడిన కస్టాలు, బాధలు ఆమెని ఇలా ఆలోచింప చేసాయి సుఖం అన్నది ఎరుగదు. ఎంతో   మానసిక క్షోభ   పడితేనో  తప్ప....  మనసు గాయపడి ఇలాటి ఆలోచనలు వస్తాయి??. 

     శవ జాగారం చేస్తూ భర్త మరణిస్తే భాగ్యలక్ష్మి  అంతరంగంతో  ఈ కథ మొదలవుతుంది. . తన పెళ్లి, అత్తా మామల విసుర్లు, గయ్యాళి అత్తా, సౌమ్యుడు   అయిన మామ... చెడు తిరుగుళ్ళ భర్త...., అత్తా పోలికలు  బుద్ధులు   పుణికి పుచుకున్న కూతురు, మామ లాంటి ఆలోచనలతో కొడుకు ....... ఈ పాత్రల సంభాషణలతో కథ నిండి వుంటుంది.  

     అంతిమ సంస్కారానికి  ఇంటితో డబ్బుతో ముడిపెట్టి కూతురు, కొడుకు తండ్రి శవం ముందు పెట్టుకుని యాస్తి లావా దేవిలు మాట్లాడుకోవటం, డబ్బువుండి   కూడా  తండ్రి దహన సంస్కారాలకి  ఆస్తితో లింకు పెట్టి డబ్బుఇచ్చిన సోదరి అమల....  దానితో ఇంటితో సంబంధం తెంచు కోవటం.....     జగదీష్ (కొడుకు)  చివరికి హైదరాబాదు పోవాలి అని తల్లితో అంటూ తదుపరి కార్యక్రమాలకి   శ్రీ కారం చుట్టటం తో కధ ముగుస్తుంది. 

      అమల తన తండ్రి ఇంటిని స్వాధీన పరచుకోవటం లో ఎంతో తెలివిగా ప్రతిదానికి వాటా లేస్తూ ఇవ్వవలసిన లక్షల డబ్బుకు వేలల్లో లెక్క  చూపుతుంది. అంతా స్వార్థం.... ప్రతిది లెక్క కడుతుంది. తండ్రి దహన సంస్కారాలకి కూడా ఖర్చులో చూపుతూ,  తను ఎంతో జాలి గుండె కలదానిని అని  పదివేలు అందిస్తుంది. "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.

        ఈ కథలో శవ యాత్ర సమయం లో చేయవలసిన కర్మ కాండల విషయం లో జరిగే సత్యాలు ఇవి....  ఎవరు పంచుకుంటారు ఈ భారాన్ని, ఈ భాద్యతలు   అని సొంత పిల్ల మధ్య వైరాన్ని చక్కగా చూపించారు రచయిత

      నాకు తెలిసి ఒకరికి చివరి సంస్కారాల విషయంలో కూడా దహన సంస్కారాలకి ధనం లేకపోతె పోయిన వ్యక్తి వంటిమీద సొమ్ముని తీసుకుని  డబ్బు ఇచ్చిన సొంత  పిల్లలూ    వాళ్ళు వున్నారు.  పది రోజుల   కార్యక్రమానికి  కూడా ఆ వ్యక్తి వంటి మీద సొమ్ములే అవసరమయ్యాయి.   

       డబ్బు ఎంతటి ద్వేషాగ్నులు రగులుస్తుందో,  ఆప్యాయతానురాగాలు   ఎలా కొరవడతాయో ఇందులో తెలుస్తుంది.
                                                                                                                                                         
                                                                                 - కోపల్లె మణినాథ్
(మణిమయూరం బ్లాగు సౌజన్యంతో)