...

...

21, జూన్ 2012, గురువారం

మాతృదేవోభవ అనే పదానికి న్యాయం చేసిన కథ!

(మాతృన్యాయం కథపై సి.ఉమాదేవిగారి విశ్లేషణ ఇక్కడ చదవండి)


         ఈ కథకు సమీక్ష రాయడం ప్రారంభించిన రోజే కన్నవారిని కాదంటే భరణం కట్టాల్సిందే అనే వార్తను చదవడం తటస్థించింది. ఆదాయవనరులు, కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి మార్గదర్శకాలుకూడా జారీ చేసినట్లు వార్త చెప్తోంది.తల్లిదండ్రుల సంరక్షణ, వయోవృద్ధుల నిబంధనలు-2011 అమల్లోకి వస్తే తల్లిదండ్రులకిక అన్యాయమే జరగదు, పిల్లలు సేవలు చేస్తుంటే వారి పని ఇక కాళ్లూపుతూ కూర్చోవడమేనని అనుకుంటారేమో!


         కథావస్తువును ఎంచుకునేటప్పుడు పాతవిషయాన్నికాక కొత్తదనానికై అన్వేషణ జరగడం సహజం.వృద్ధులైన తల్లిదండ్రులు-పిల్లల నిరాదరణ అన్నసమస్య నిత్యనూతనం కాదుకాని అదొక రావణకాష్ఠం. నేటియవ్వనమే రేపటి వార్ధక్యం కదా?అద్భుతమైన మార్పు ఆవిష్కరింప బడితే తప్ప ఈ విషయం పాతబడదు.మరి ఈ మార్పు ఎక్కడ ప్రారంభమవాలి? మనిషిలోనా?మనుగడలోనా?పిల్లల ప్రవర్తనాతీరును, తల్లిదండ్రులపట్ల వారి ఉదాసీనతను సమాజం ఆక్షేపించాలా లేక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా?ఇలాంటి ప్రశ్నలెన్నిటినో లేవనెత్తిన కథలోని మలుపులు చూద్దాం.



   న్యాయవాది రాఘవరావు నేరస్థుడిని శిక్షింపచేయడంలో తన వాగ్ధాటినే పదునైన కత్తిగా వాడటంలో దిట్ట.అటువంటి న్యాయవాది, తన పొరుగుననే వున్నవృద్ధదంపతులు దుర్గాంబ,అనంతపద్మనాభంలు కొడుకు ఇంట, కోడలిచేత పడుతున్న అగచాట్లను నిశితంగా గమనించేవాడు. ఆ నేపథ్యంలో వారి కొడుకు, కోడలిపై క్రిమినల్ నెగ్లిజన్స్ నేరంగా ప్రతిపాదించి, విధింపచేసే శిక్ష కఠినమైనదే అవుతుంది.

     శారీరక బాధలకు పరిష్కారం వైద్యం. మందులు,సర్జరీలు అనారోగ్యాన్ని జయించలేనపుడు విముక్తిగా మరణాన్ని కోరుకుంటాడు మనిషి. అయితే మానసిక, శారీరక బాధేదైనా పిల్లల ప్రేమపూర్వక పలకరింపులే అమ్మానాన్నలకు చలివేంద్రం. ఇవి కొరవడిన అనంతపద్మనాభం తమ పుత్రుడు తమను శారీరక, మానసిక బాధలకు గురి చేస్తున్నాడని న్యాయవాది రాఘవరావు ద్వారా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు. ఇక కోర్టు వాతావరణాన్ని కథనానికి తగినట్లు చిత్రీకరించడంలో శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం సఫలీకృతులైనట్లే.

   న్యాయవాది ఆస్తుల వివరాలు ప్రశ్నించినపుడు దుర్గాంబ తడబడుతుంది. ఆ తడమాటుకు తన చురచుర చూపులతో అనంతపద్మనాభం చురకలంటిస్తాడు. కథాశిల్పంలో ఈ ఎత్తుగడ కథాపఠనంపై ఉత్సుకతను పెంచింది. ముగింపుఎలా ఉంటుందోనన్న ఆతృతకు మొగ్గ తొడిగింది. తల్లిదండ్రులమీద దయలేని పుత్రులను చెదలతో పోల్చిన వేమన మానవత్వంలేని పుత్రులను కాస్తంత ఘాటుగానే విమర్శించాడు. అదే తనమాటగా నొక్కిచెప్పాడు న్యాయవాది రాఘవరావు. కొడుకుకోసం తమ ఆస్తులన్నీ కరిగించేసుకున్న దుర్గాంబ, అనంతపద్మనాభంల కొడుకు సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలని రాఘవరావు కోర్టును కోరడం సామాజి స్పృహ వున్న ఎవరిచేతనైనా ఆమోదింపబడే న్యాయమే.



   డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ క్రాస్ ఎగ్జామిన్ కు ఉపక్రమించినపుడు దుర్గాంబ పేరు లలితమ్మగా మారడం కథాగమనానికేం అడ్డుకాలేదు.



      మనవడు తేజను బడికి తీసికెళ్లినపుడు జరిగిన ప్రమాదంలో తేజ, అనంతపద్మనాభం ఇద్దరు గాయపడతారు. ఆ రోజు పుట్టినరోజు కూడా కావడంతో వేసిన కొత్తబట్టలు మట్టికొట్టుకుపోయి గాయాలైన తేజకు మందు రాస్తున్న కోడలు దివ్య దగ్గర, భర్తకు కూడా కాస్త మందు తీసుకోబోయిన అత్తను విసురుగా తోస్తుంది కోడలు.ఫలితం... గోడను గుద్దుకుని తల చిట్లి సొమ్మసిలి పడిపోతుంది దుర్గాంబ.ఈ సంఘటనే అనంతపద్మనాభాన్ని కోర్టు ముంగిట నిలిపింది. అయితే కోర్టులో దుర్గాంబ సమాధానాలు అందరిని ఆశ్చర్యపరిచే దిశగా సాగుతాయి.అటు కొడుకు ఇటు భర్త! ఎవరి పరువు భంగపడరాదు. వారిద్దరి మర్యాద తనపైనే ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు. భర్త బాధపడినా కొడుకు చిన్నబోయినా ఆమెకు బాధే! సమాజంలో జరిగే తప్పుకు సమాజం బాధ్యత ఉండదా?ఈ ప్రశ్న దుర్గాంబ సంఘర్షణలోనుండి ఉత్పన్నమవుతుంది.



      ఒకప్పుడు పాఠశాలల్లో మోరల్ సైన్స్ పేరిట వారానికి ఒక పీరియడైనా వుండేది.కాని ఆ సమయాన్నికూడా లెక్కలు,కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు కబ్జా చేస్తున్నాయి.కాసులొచ్చే చదువులకే క్లాసులలో ప్రాధన్యత పెరిగి సమాజానికి ఉపయోగపడే పాఠాలు మృగ్యమవుతున్నాయన్న నిజాన్నితల్లి దుర్గాంబ పాత్ర ద్వారా రచయిత చక్కగా వినిపించారు.



     పెద్దలకు,పిల్లలకు నడుమ అత్మీయబంధమే గృహపాలనలోని మూలసూత్రంగా గుర్తింపునందుకున్ననాడు శ్రీనివాస్ గారి చేతిలో పురుడు పోసుకున్నఈ కథకు ఊపిరందుతుంది.చివరకు టి.వి. సీరియళ్లలోని అత్తా కోడళ్ల హింసనాదాలు కూడా మనుషులదారేకాక మనసులదారే తప్పేటట్లు చేస్తున్నాయి,నీతిపాఠాలు నేటి పిల్లలకు దూరమయాయంటూ దుర్గాంబ కార్చిన కన్నీరు కన్నతల్లులందరిదీ. ఆవేశంలో జరిగే అనర్థాలలో ఇది కాకతీళయంగా జరిగిన ఒక సంఘటనే తప్ప మరేమి కాదంటూ,ముందుగా పథకరచన జరగలేదన్న సూక్ష్మాన్ని హుందాగా తెలిపిన దుర్గాంబ మాటలు అందరిని మాటరానివారిని చేసాయి.కోడలి దురుసుతనానికి,కొడుకు నిర్లిప్తతకు తగిన శిక్ష పడాలని వాంఛించిన అనంతపద్మనాభం ఆవేశానికి దుర్గాంబ పలుకులు హిమవర్షమే!ఇక చివరకు వారి కొడుకు సాయికిరణ్ కు ఏ శిక్ష పడుతుందోనని ఆతృతగా చూస్తుంటే తల్లిదండ్రులను యాత్రలకు తీసికెళ్లమని న్యాయమూర్తి సూచించినపుడు శ్రవణకుమారుని కథ గుర్తుకు వస్తుంది.మరి అన్యాయానికి న్యాయం చేసిన మాతృన్యాయమూర్తి చేసింది సబబేనా అని ప్రశ్నించుకుంటే విభిన్నస్పందనలు వినిపిస్తాయి.ఎన్నివిన్నా చివరకు చెప్పగలిగేదొకటే....మాతృదేవోభవ!



   సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకుని దాని వెనుకగల మూలకారణాలను దుర్గాంబ పాత్ర ద్వారా తెలియచేసి చర్చకు వేదిక కాగల అంశాలనెన్నింటినో మనముందుంచిన రచయిత గంగా శ్రీనివాస్ గారు అభినందనీయులు.


      మాతృన్యాయం కథను క్రింద ఇవ్వబడిన లింకులో చదవండి.


(చిన్నిగుండె చప్పుళ్లు బ్లాగు సౌజన్యంతో)

19, జూన్ 2012, మంగళవారం

కాపీ రాయుళ్లను ఏం చేయాలి?

అనుకోకుండా ఈరోజు కూడలి చూస్తే కథాలహరి అనే పేరుతో వస్తున్న బ్లాగులో నా కథాజగత్‌లో వచ్చిన కథలు కొన్ని కనిపించాయి. కొంత ఆశ్చర్యంతో ఆ బ్లాగును ఓపెన్ చేసి చూస్తే అందులో కథాజగత్‌లో వచ్చిన కథలన్నీ యథాతథంగా నేను వాడిన ఫాంట్లు కలర్లతో సహా అలాగే కాపీ చేసి ఉన్నాయి. నేను కథాజగత్‌ను అంతర్జాలంలో తెలుగు కథకు తగిన ప్రాచుర్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రారంభించాను. మొదట బ్లాగుగా ప్రారంభించి అందులోని యిబ్బందుల్ని అధిగమించడానికి వెబ్‌సైటుగా మార్చాను. యిప్పటి వరకు 225 కు పైగా కథల్ని ప్రచురించాను. అన్ని కథలనూ ఆయా కథా రచయితల అనుమతి తీసుకుని నా వెబ్‌సైట్‌లో ప్రచురించాను. ఆయా కథలు ప్రచురింపబడిన పత్రికలను కూడా తేదీతో సహా కథ క్రింద పేర్కొన్నాను. కథాజగత్‌కు రచయితలనుండి పాఠకులనుండి మంచి స్పందన లభించింది. నేను రెండేళ్ళకు పైగా కష్టించి ప్రకటించిన కథల్ని అజయ్ వెల్లంకి అనే శాల్తీ రెండు వారాల్లో తన కథాలహరి బ్లాగులో కాపీ చేసేశాడు. కనీసం ఎక్కడా కథాజగత్‌నుండి ఈ కథల్ని తీసుకున్నట్టు పేర్కోలేదు. ఇలా మన బ్లాగుల్లోని/వెబ్సైట్లలోని కంటెంటును మన అనుమతి లేకుండా కాపీ కొట్టే వారిపై మనం ఏం చేయగలం? మీ సలహా కావాలి.

రహస్యం

ఆర్.దమయంతి గారి కథ రహస్యం కథాజగత్‌లో చదివి హృదయ సౌందర్య రహస్యాన్ని తెలుసుకోండి.

13, జూన్ 2012, బుధవారం

గ్రంథాలయ సర్వస్వంలో విద్వాన్ విశ్వం!

గ్రంథాలయ సర్వస్వం జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై శ్రీ బత్తుల వెంకటరామిరెడ్డిగారి సమీక్ష వచ్చింది. 











నడుస్తున్న చరిత్రలో ముక్తవరం పార్థసారథి గారి సమీక్ష!

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై శ్రీ ముక్తవరం పార్థసారథి గారు సమీక్ష వ్రాశారు. ఆ   సమీక్ష  ఈ క్రింది లింకులో చూడవచ్చు.


http://teblog.kinige.com/?p=1866

8, జూన్ 2012, శుక్రవారం

యోజనలో సమీక్ష!

యోజన అభివృద్ధి మాసపత్రిక జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై ఎం. సుబ్బరాజుగారు సమీక్ష వ్రాశారు. తురుపుముక్క పాఠకులకోసం ఆ సమీక్ష పాఠం ఇక్కడ. 



సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం (వ్యాస సంకలనం) 


       తొందరలో 2015లో రాబోతున్న విద్వాన్ విశ్వంగారి శతజయంతిని దృష్టిలో పెట్టుకుని ఆ సాహితీ పూర్ణచంద్రుడికి డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌గారలు ఉడుతాభక్తితో ఈ గ్రంథాన్ని అడ్వాన్స్ నైవేద్యంగా తీసుకురావడమన్నది హర్షదాయకమైన విషయం. లోగడ ఆయన కలం నుండి ఆంధ్రప్రభలో వెలువడే 'మాణిక్య వీణ' నుంచి ఎన్ని అక్షర సుగంధాలు వెలువడ్డాయో తెలియని సాహితీ ప్రేమికులు తెలుగు నేల మీద లేరనే చెప్పాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి తేలేక పోయినా విశ్వంగారి మేరు శిఖర సమాన వ్యక్తిత్వాన్ని చక్కగా సోపపత్తికంగా ఇందలి వ్యాసాలలో మనం గమనించగలుగుతాం!
         
      సాహితీవిరూపాక్షుడైన విశ్వంగారు నిర్వహించిన పత్రికలలోని శీర్షికలు, సమీక్షలు, సందేశాలు, ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో గుదిగుచ్చి ఈ గ్రంథానికో నిండుదనం తీసుకొచ్చారు సంపాదకులు. విషయాన్ని నాలుగు అధ్యాయాల్లో పొందుపరిచారు. వారు నాగిరెడ్డి అనే వారితో కలిసి 'నవ్యసాహితి'అనే పత్రికను నిర్వహించిన భోగట్టా కూడా ఈ గ్రంథంలో ఉటంకించారు. విశ్వంగారు తొలిదశలో రాజకీయాలకు సన్నిహితులుగా తలమునకలైవున్నా పత్రికా సంపాదకత్వం బాటలో పయనిస్తున్నాని చెప్పడం వారికి మాతృభాష పట్ల, స్వజాతి జనుల పట్ల గల ప్రేమ వ్యక్తం అవుతున్నది.
          
విరికన్నె, పాపం, రాతలు గీతలూ, నా హృదయం వీరి కలమ్నుండి వెలువడ్డ లఘుకృతులైతే పెన్నేటిపాట, ఒకనాడు అనేవి కావ్యకన్నికలు. అయితే విద్వాన్ విశ్వంగారు అసంఖ్యాకములైన అనువాదాలు చేసియున్నారు. అవి సంకృత భాషనుండి, పాశ్చాత్య భాషలనుండీ జరిగినా అది ప్రక్రియాపరంగా చెప్పాలనంటే నవలలు, నాటకాలు, కథలు, కావ్యాలు, సిద్ధాంత గ్రంథాలు ఇలా ఎన్నో లెక్కకు మించి దర్శనమిస్తాయి. పైగా అనువాదమన్నది అనుకున్నంత తేలికైన విషయం కాదు. అది కత్తి మీద సాము వంటిదని అనుభవమున్న ప్రతి ఒక్కరికీ తెలిసిన అంశం. ఈ గ్రంథం చదవటం ద్వారా పాఠకులకు ముఖ్యంగా వారి రచనలో కనిపించే లోతైన ఆలోచనలు, సమన్వయవాదం, అవగాహన, అర్హులైనవారికి తగిన గౌరవం లభించాలన్న ఆతృతలు వీటికి తోడు అద్భుతమైన గతకాల జ్ఞాపకాల దొంతరలకు సాక్ష్యంగా ఈ పుస్తకం దర్శనమిస్తుంది.

సంపాదకుల శ్రమకూడా తక్కువని చెప్పలేం. ఒక వ్యక్తి తాలూకు ఔన్నత్యాన్ని పలువురికీ విశదపర్చగలందులకు చేసిన గట్టి కృషిగా నిలుస్తుంది. ఇదొక విలక్షణమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగా, మేధావిగా, రచయితగా విశ్వంగారిలోని పలుకోణాల్ని ఆవిష్కరిస్తూ పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. సంపాదకుల కృషిని అభినందించకుండా ఉండలేము.

- ఎం.సుబ్బరాజు



6, జూన్ 2012, బుధవారం

పొత్తూరి వారి సమీక్ష!

విద్వాన్ విశ్వం గారి జీవితంపై 2011 ఉత్తరార్థంలో రెండు పుస్తకాలు వెలువడ్డాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన మోనోగ్రాఫ్. రెండవది ఇక్కడ సమీక్షితున్న 'సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అనే సంకలన గ్రంథం.


రెండు ప్రచురణలలోనూ ప్రముఖ మీడియా వ్యాఖ్యాత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి కృషి ఉంది. సాహిత్య అకాడమీ ప్రచురణ ఆయన వ్రాసిన గ్రంథమే. 'సాహితీవిరూపాక్షుడు ...' డాక్టర్త్ నాగసూరి వేణుగోపాల్, శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ సహ సంపాదకత్వంలో వెలువడినది.


అకాడమీ ప్రచురణలో డాక్టర్ వేణుగోపాల్ గారు చేసిన మూర్తిమత్వ చిత్రణ ఒక్కటే కనిపిస్తుంది. 'సాహితీవిరూపాక్షుడు ...'లో విశ్వం గారితో పరిచయం ఉన్న పలువురి అభిప్రాయాలే గాక ఆయన పత్రికలలో నిర్వహించిన కొన్ని శీర్షికలలోని రచనలూ, వ్యాసాలూ కూడా ఉన్నాయి.


సంపాదకులు తమ 'నివేదన'లో 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం విశ్వంగారి విరాట్ స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయినప్పటికీ 'కొంతలో కొంత వారి జీవన రచనా రీతులను' తెలియజేస్తుందన్నారు. 


నిజమే. మూడు ముఖ్యమైన రంగాలలో విశ్వం గారు చేసిన కృషి తెలియజేసి, ఆయన సంపూర్ణ మూర్తిమత్వాన్ని 263 పేజీల గ్రంథంలో ఆవిష్కరించడం సాధ్యం కాదు. ఐనప్పటికీ, గ్రంథంలోని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ అనే నాలుగు అధ్యాయాలు దేనికది సంపూర్ణంగానే కనిపిస్తాయి. వైవిధ్యం కలిగిన రచనలు అందులో ఉండటమే అలాంటి భావన కలిగిస్తుంది. ఈ నాలుగు 'విశ్వ' పదబంధాలూ విశ్వంగారు సృష్టించినవే కావడం ఒక విశేషం.


విశ్వం గారు కృషి చేసిన మూడు ముఖ్యమైన రంగాలలో మొదటిది ప్రజాసేవ. యువకుడిగా ఆయన అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో నీలం సంజీవరెడ్డిగారితో సమస్థాయిలో నాయకత్వ బాధ్యత నిర్వహించారు.


సాహిత్య రంగం రెండవది. ఆయన రచించిన 'పెన్నేటి పాట' లాంటి రచనలు ఆయన సమకాలీన సాహితీవేత్తలెందరి నుంచో ప్రశంసల నందుకున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనను 'సరస కవి' అన్నారు. "విశ్వం గారు తెలుగు సాహిత్యంలో 'పెన్నేటి పాట' రచించి, నార్ల వారికి అంకితం చేసి, రాళ్లపల్లి వారి మెప్పుబడసి అస్మదాదులను అలరించాడు" అన్నారు దాశరథి గారు.


"ఆయన సనాతనాధునాతన సంప్రదాయ సేతువులు. శాస్త్ర సంవిత్సముద్ర పారీణులు" అని ప్రశంసించారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు. విశ్వం గారు నార్ల వెంకటేశ్వరరావు గారితో కలసి పత్రికలలో పనిచేశారు. ఆయన అభిమానానికి, విశ్వాసానికి పాత్రులైనారు.


2015 విశ్వంగారి శతజయంతి సంవత్సరం. దేశ సేవ, సాహిత్యం, పత్రికలు అనే మూడు రంగాలలో విశ్వంగారి విశిష్ట సేవలను గురించి తెలుసుకోవటం కొత్త తరాలకు, ముఖ్యంగా రచయితలకు, జర్నలిస్టులకు ఉపయోగకరం.


విశ్వంగారు భౌతిక శరీరాన్ని వదలిన రెండు పుష్కరాలకు 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం వెలువడి నవతరాల ఈ అవసరాన్ని తీరుస్తున్నది. దేశ సేవ ఎలా కళంక రహితంగా చేయాలో, సాహిత్యాన్ని ఎలా ప్రజోపయోగం కావించాలో, పత్రికారచనలో ఎలాంటి ప్రమాణాలను పాటించాలో, విశ్వం గారి జీవితం ఎలా ఆదర్శప్రాయమో ఈ గ్రంథం అవగాహన కలిగిస్తుంది - కొంతలో కొంత కాదు తగినంతగా...!


- పొత్తూరి వెంకటేశ్వరరావు

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక జూన్ 2012 సంచికలో ప్రచురితం)







5, జూన్ 2012, మంగళవారం

విద్వాన్ విశ్వం సాహితీ విరాట్ రూపం

రాజకీయ సాహిత్య సామాజిక రంగాల్లో అవిరళమైన కృషి చేసిన రాయలసీమ రత్నం - విద్వాన్ విశ్వం. అయితే ఆయన నిజాయతీ, నిబద్ధత కలిగిన సంపాదకుడిగా, 'పెన్నేటి పాట'వంటి గ్రంథ రచయితగా అసామాన్య కీర్తిమంతుడు. ఆధునిక పంచకావ్యాల్లో ఒకటొగా 'పెన్నేటి పాట' తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందింది. విద్వాన్ విశ్వం సాహితీ విరూపాక్షుడు. ఆయన వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తిత్వం దర్పణంగా ఈ మంచి పుస్తకాన్ని వెలువరించారు అబ్జ క్రియేషన్స్ (హైదరాబాదు) వారు. ఆలోచనీయమైన, అధ్యయనావశ్యకమైన, విలువైన సమాచారగతమైన ఈ వ్యాస సంపుటికి సంపాదకత్వం వహించిన ప్రసిద్ధ రచయితలు డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్.

ఈ వ్యాస సంపుటిలో నాలుగు అధ్యాయాలున్నాయి. 'విశ్వజీవి'లో విశ్వంగారి జీవితాన్ని, సాహిత్యాన్ని, వారిపైగల అభిప్రాయాల్ని, వారితోగల పరిచయాల్ని వివరించే వ్యాసాల్ని పొందుపరిచారు. 'విశ్వరూపి'లో విశ్వంగారు నడిపిన శీర్షికలు తెలుపు - నలుపు, మాణిక్యవీణలతో పాటు మరికొన్ని వ్యాసాలున్నాయి. 'విశ్వభావి'లో రచయిత మాటలౌ, పీఠికలు, పుస్తక సమిక్షలూ వచ్చాయి. 'విశ్వమేవ'లో విశ్వంగారి సందేశాలు, ఇంటర్వ్యూలు వున్నై. మొదటి అధ్యాయంలో సాహితీ ప్రముఖులైన విశ్వనాథ, వేలూరి, దివాకర్ల, దాశరథి, ఆరుద్ర, అనంతకృష్ణశర్మ, మిక్కిలినేని, ఏటుకూరి బలరామమూర్తి, కల్లూరు అహోబలరావు, మహీధర రామ్మోహనరావు వంటి వారి వ్యాసాలు కాక నేటి లబ్ధప్రతిష్టులు అద్దేపల్లి, మాలతీచందూర్, వెలుదండ నిత్యానందరావు, నాగ్సూరి మొదలైన సాహితీపరుల వ్యాసాలున్నాయి. ఈ 20 వ్యాసాల్లోనూ విశ్వం గారి గురించిన ప్రశస్త విషయాలూ, విశేష విషయాలూ ఎంతో వివరణాత్మకంగా ప్రస్తావించబడినై. వీటిలోని సమాచారం ఈతరం పాఠకులకు ఎంతో స్ఫూర్తిదాయంగా వుంది. 

'విశ్వం జీవితమే ఆయనకొక దృక్కోణాన్ని అందించింది' అంటూ ఆ దృక్కోణం ద్వారా ఆయన రచనల్లో స్థూలంగా చెప్పిన అంశాల్లోని సూక్ష్మార్థాల్నీ, ఆయన సూక్ష్మంగా చెప్పిన వాటిల్లోని స్థూలార్థాల్నీ విశ్లేషణాత్మకంగా చెప్పారు - యాదాటి కాశీపతిగారు. ఈ అధ్యాయానికి నిండుతనాన్నీ, విశిష్టతనీ తెచ్చిన ఎంతో ముఖ్యమైన వ్యాసం వారిది. రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాల్లో విశ్వం కృషికి దర్పణంగా వుందీ వ్యాసం.

అలాగే 'సమన్వయ మూర్తి విద్వాన్ విశ్వం' అనే తమ సమగ్ర వ్యాసంలో నాగసూరి వేణుగోపాల్ 'విశ్వంగారి ఆలోచనా సరళి, పాండితీ సమన్వయం, విశాల దృక్పథం, నేటి రచయితలకు, పాత్రికేయులకు ఎందుకు స్ఫూర్తిదాయకమో సోదాహరణంగా వివరించారు. తనదైన ప్రత్యేక వ్యాసరచనా విలక్షణతతో, ప్రణాళికతో - నాగసూరిగారి వ్యాసంలో కొండంత విశ్వంకి తన ప్రతిభాదర్పణం పట్టారు.


విశ్వంగారు నిర్వహించిన శీర్షికల్లో తెలుపు - నలుపు మాణిక్యవీణ వ్యాసాల్లో ఎన్నికగన్న వాటిని రెండో అధ్యాయంలో చేర్చారు. వీటన్నిటా విశ్వంగారి ప్రతిభావ్యుత్పత్తి ద్యోతకమవుతూ వున్నై. అన్నిటా సమాజం గుండె చప్పుళ్లని విశ్వంగారు విని, సంవేదనాత్మకంగా, ఆలోచనీయంగా పాఠకులకు వినిపించిన విధానానికి అబ్బురం కలుగుతుంది. ఆనాటికి వర్తమాన సామాజికాంశాల్ని వారు గవేషించిన తీరుకి ఆశ్చర్యపోతాము. ఉదాహరణకు 1.12.70 నాటి మాణిక్యవీణ వ్యాసం ఇలా మొదలవుతుంది. 'అనుభవిస్తున్నప్పటి తీవ్రతను ఏ బాధ అయినా తర్వాత గోల్పోతుంది/ నడుస్తున్నప్పుడు  పడిన వేసట గమ్యం చేరుకున్న తర్వాత మఱుగున పడిపోతుంది/ సరికొత్త తరం వారికి తెలంగాణా అలనాటొ రూపు ఎంత ఊహించుకున్నా కానరాదు/ పాతతరం వాఇకైనా అప్పటి అనుభవాలు కొన్ని పరగడుపున బడిపోవడం సహజం. ఆ తర్వాత ఆయా విశేషాల్ని చదువుతాము.' ఇదీ విశ్వం శైలి. ఈ శైలిలో పఠితని ఒక మూడ్‌లోకి లాక్కొచ్చే గుణంతో పాటు, రచనని చదివించే గుణాన్ని సమకూర్చే నేర్పూ గోచరిస్తుంది.

మూడవ అధ్యాయం 'విశ్వభావి'లో విశ్వంగారు రాసిన పీఠికలు, సమీక్షలు ఉన్నాయనుకున్నాం. వీటిలో రంగనాయకమ్మ నవల 'కళ ఎందుకు?'కు రాసిన 'ఆముఖం' - విశ్వంగారి రచనలోని వొంపు వాటాల్నీ, ఎత్తుపల్లాల సొబగుల్నీ; అక్షరంతో చదువరి గుండెని తాకే పదశక్తినీ తెలుపుతుంది. తెలుగు వచన రచనలోని సరళత్వాన్నీ, సరసత్వాన్నీ, గాఢతనీ, సాంద్రతనీ - ఒక్కచోట చూసి చదివి ఆనందించే అదృష్టాన్నిస్తుందీ 'ఆముఖం'. అదే సందర్భంలో ఎంతో పదునైన భావజాలాన్ని విసిరి ఆలోచనా ప్రేరకంగా నిలుస్తోంది.




నాలుగో అధ్యాయంలోని ఇంటర్వ్యూల్లో విశ్వంగారి నిర్భీతీ, నిబద్ధతా, లోకజ్ఞతా, సాహిత్య విజ్ఞతా - అన్నీ పారదర్శకంగా కనిపిస్తాయి. 'జానపద కవిత్వమెంత సజీవంగా వుందో, అదే విధంగా పురాణ కవిత్వం కూడా నేటికీ నిలిచే వున్నది. దానికి కారణం రెండింటిలోనూ వున్నటువంటి రసస్ఫోరకత్వమే' అన్నవారి ప్రకట దీనికి ఒక ఉదాహరణ.

ఈ పుస్తకం సంపాదకులిద్దరూ ఒక కష్టసాధ్యమైన పనిని జయప్రదంగా పూర్తిచేశారు. విద్వాన్ విశ్వం వ్యక్తి జీవితంలోనూ, సాహిత్య వ్యక్తిత్వంలోనూ వున్న బహువిధ పార్శ్వాల్నీ, బహుముఖ కోణాల్నీ తెలుసుకునే అవకాశాన్ని తెలుగు పాఠకులకందించి సాహితీలోకానికి గొప్పమేలు చేశారు. అభినందనీయులు!!
                                                                                               -విహారి

(పాలపిట్ట జూన్ 2012 సంచికలో ప్రచురితం)

    

4, జూన్ 2012, సోమవారం

మాణిక్యవీణ సృష్టికర్తకు నీరాజనం!

వార్త దినపత్రిక ఆదివారం 13,మే 2012 సంచికలో కృతి శీర్షికలో ప్రచురితమైన సమీక్ష పూర్తిపాఠం.

కోటి గొంతుల కిన్నెరమీటుకొనుంచు
కోటి గుండెల కంజరి కొట్టుకొనుచు
'పెన్నేటి పాట'తో రాయలసీమ కరువు కాటకాలను సాహితీమాధ్యమం ద్వారా ఆంధ్రపాఠక లోకం ముందు ఆవిష్కరించిన విద్వాన్ విశ్వం అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. విశ్వం కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో చదివి, మద్రాసు విశ్వవిద్యాలయం నుండి విద్వాన్ పట్టా పుచ్చుకొన్నారు. విశ్వం మనువునీ మార్క్సునీ సమంగా అర్థం చేసుకొన్నారని ఒకరంటే నాటి రాయలసీమలో అంగళ్లలో రత్నాలు కొలిచే రోజులున్నా నేటి రాయలసీమ ప్రజల కన్నీటి కష్టాలను ఆయన గుది గుచ్చి విశ్లేషినంతగా వేరెవరూ చెప్పలేరని మరో వ్యాఖ్య.  సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పేరిట రచయితలు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌లు సంయుక్తంగా సేకరించి సంకలనం చేసిన పుస్తకమిది. విశ్వవిద్యాలయాల్లో పి.హెచ్.డి స్థాయిలో విద్వాన్ విశ్వం రచనలపై కనీసం ఒక్క పరిశోధన కూడా వెలుగు చూడలేదంటూనే అలాంటి పరిశోధనాత్మక పరిశీలనా వ్యాసాన్ని వీరు సాహితీ లోకానికి అందించారు. 

ఆయన మాణిక్యవీణ, తెలుపు నలుపు శీర్షికలద్వారా తెలుగు పత్రికా పాఠకులకు సాహితీ ప్రియులకు చిరపరిచితుడు. 'తెలుపు-నలుపు' సాహిత్య పాఠకుల కోసం రాస్తే మాణిక్యవీణ సామాన్య పాఠకులకోసం రాశారని ఆయన రచనా వ్యాసంగాలను పరిశ్రమించిన వారు స్పష్టంగా విభజన చేసేసారు. ఈ పుస్తకాన్ని అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించి వచ్చే 2015వ సంవత్సరంలో విశ్వంగారి శతజయంతి జరుగబోతున్న రీత్యా రచయితలు విద్వాన్ విశ్వం గారి రచనా వైదుష్యాన్ని సాహితీ లోకానికి, పాఠకలోకానికి అందించాలన్న తపనతో రచయితల సంకల్పం సానుకూలపడింది. తత్ఫలితంగా మనచేతుల్లోకి 263పేజీల పుస్తకం అలరించింది.  

విశ్వంగారి జీవన రచనారీతులను తెలియచేసే విధంగా రూపుదిద్దుకున్న నాలుగు అధ్యాయాల పుస్తకమిది. 'విశ్వజీవి' అధ్యాయంలో విశ్వంగారి జీవితాన్ని సాహిత్యాన్ని వారిపై అభిప్రాయాన్ని, పరిచయాలను క్రోడీకరించే వ్యాసాలున్నాయి. 'విశ్వరూపి'లో విశ్వం నడిపిన శీర్షికలు తెలుపు - నలుపు, మాణిక్యవీణల్తో పాటు మరికొన్ని వ్యాసాలున్నాయి. 'విశ్వభావి' అనే అధ్యాయంలో రచయితమాటలు, పీఠికలు, పుస్తకసమీక్షలు, 'విశ్వమేవ' లో ఆయన సందేశాలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి. విశ్వంగారి రచనల మీద అధికారికంగా విశ్వవిద్యాలయాల స్థాయి పరిశోధనలు చేయదలచిన వారు ఈ పుస్తకం ఆసాంతం తిరగేస్తే చాలు. ఇందులో గతంలో పలు సంధర్భాలలో 21మంది సాహితీవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు, ప్రసిద్ధ కవులు రాసిన వ్యాసాలున్నాయి. అందులో కొన్ని విషయాలను వార్త పాఠకుల కోసం ముచ్చటించుకుందాం.

విశ్వం 'పెన్నేటి పాట'లో రాయలసీమ పలుకుబళ్లు, నానుడులు, మాటల తీరుతెన్నులు, వ్యవసాయ విధానాలు, ఆహార విహారాదులు, సీమ వాసుల మనోగతాలు - ఇలాంటి విశేషాలెన్నింటినో సమకూర్చారు. నిజమైన కవికి హృదయ స్పందనం, నిశిత దృష్టి, మానవత, భావి జగత్కళ్యాణం మీద అపార విశ్వాసం ఉండాలని విశ్వం పేర్కొనేవారు.

ఆయన 'పెన్నేటి పాట'ను మెచ్చుకోని వారు లేరు. స్వస్థానంపై అభిమానంతో దాశరథి 'నా తెలంగాణ కోటి రత్నాల వీణ' అంటే విశ్వం 'రాయలసీమ మించుల సితారు పచ్చల బజారు' అంటాడు. దాశరథి సూక్తి నినాదమై గర్జించింది. విశ్వం ఆర్తి నిదానమై వ్యాపించింది. ఇది ఆనాటి సంగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో ఆరుద్ర మాట. ఇక 'నాకు తెలంగాణ అంటే ఆవేశం వచ్చినట్లు విశ్వంగారికి రాయలసీమ అనగానే ఆవేశం పొంగి వస్తుంది. స్వయంగా డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య విశ్వం షష్టి పూర్తి అభినందన సంచికలో రాసిన మాటలివి. అంతమాత్రాన అన్య ప్రాంతాల మీద అభిమానం లేకపోలేదు. ఇవి దాశరథి నోటివెంట జాలువారినవే.

పలుకుతీరులో, పలుకుబడుల పోహళింపులో, ఛందో గమనంలో విశ్వానిది ఒక విలక్షణ రీతి. ఈ విషయాన్ని స్వయంగా విశ్వంగారే అంగీకరించారని పున్నమరాజు నాగేశ్వరరావు విశ్వం గురించి రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. చాలామంది తమ వ్యాసాల్లో విశ్వంపై వ్యాసాల్లో ఏనాడో చెప్పినా ఈనాటికీ అవి కరతలామలకములే. భావంలోనూ, భాషలోనూ, కథనంలోనూ పత్రికారంగంలోనూ విభిన్న ధోరణులు చోటు చేసుకుంటున్న ఈ రోజుల్లో పాత్రికేయులు విశ్వం వ్యాసాలను పాఠ్యాంశాలుగా అధ్యయనం చేయాలి.
 
తెలుగు సంస్కృతి విశృంఖలంగా విహరించి విశ్వవ్యాప్తం కావాలన్నదే విశ్వం ఆకాంక్ష.
 
బాణుడు సంస్కృతంలో రచించిన 'కాదంబరి'ని తెలుగులోకి అనువదించిన సాహసికుడాయన. పాళీ భాషలో గుణాఢ్యుడు రచించిన 'కథా సరిత్సాగరం'ను సంస్కృతంలోకి సోమదేవసూరి అనువదిస్తే విశ్వం 12 సంపుటాలుగా తెనుగీకరించారు.

- వరిగొండ కాశీవిశ్వేశ్వరరావు