...

...

14, జులై 2009, మంగళవారం

పుస్తక సమీక్ష! -13 కన్నోజు కవిత

[పుస్తకం: కన్నోజు కవిత, రచన: కన్నోజు లక్ష్మీకాంతం, పేజీలు: 107, వెల: రూ70/-, ప్రతులకు: ఇం.నెం.18-3-463/1/175/1, రాజన్న బావి, ఫలక్‌నుమా, హైదరాబాద్.]

ఈ కవితాసంకలంలో 50 కవితలున్నాయి. ఈ కవితలన్నీ సరళంగానూ, స్పష్టంగానూ చక్కని భావాలను వెల్లడిస్తున్నాయి. ఈ కవితల్లో వస్తువైవిధ్యత విస్తృతంగా ఉంది. పల్లెల పట్ల తమ అభిమానాన్ని చాటే కవితలు కొన్ని, నగరంలోని మురికివాడలను, లేబర్ అడ్డాలను వర్ణించే కవితలు కొన్ని ఉన్నాయి. పర్యావరణం, దాని పరిరక్షణ పట్ల కన్నోజు లక్ష్మీకాంతం గారికి ఉన్న అవగాహన కాపాడుకుందాం,ధరిత్రి, పర్యావరణమంటే...!, ప్రకృతిని చూసిగూడా....! అనే కవితలలో స్పష్టమౌతున్నది.

"ప్రగతెప్పుడూ ప్రతిఫలం కోరకున్నా
నిర్దయగా ఛిద్రం చేస్తున్న మనం
నింపాదిగా ఆలోచించాలి" అంటారు.

మానవత్వం, జాగృతి కావాలి, సంస్కృతిని కాపాడుకుందాం మొదలైన కవితలు కవి మనోభిలాషను వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులను పలుకరించే తీరికలేని పిల్లల తీరుపట్ల కవి ఆవేదన చెందుతున్నారు. నగరాలలోని డాంబికాలు, ఊర్లలోని అనురాగాల నడుమ వ్యత్యాసాలను చేతికర్ర కవితలో చక్కగా తెలుపుతున్నారు. అమ్మను అద్దంతో పోలుస్తూ కన్నోజువారు 'అమ్మను అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోద'నే సత్యాన్ని చాటుతున్నారు. గతంలో ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా దాన్ని అసహ్యించుకోకూడదంటున్నారు వెనక్కి తిరిగి చూడండి అనే కవితలో. కమ్యూనికేషన్ రంగంలో ఎంత పురోగమించినా ఉత్తరాలను రాసే అలవాటును మానకూడదంటున్నారు.

"ఉత్తరం రాసి చూడండి
అనుబంధాన్ని డిపాజిట్ చేయండి" అని ప్రవచిస్తున్నారు.

కవులు రచయితలను ఉద్దేశిస్తూ కన్నోజు లక్ష్మీకాంతం గారు వారికి ఇలా మార్గనిదేశనం చేస్తున్నారు.


"ఒప్పించేరీతిలో, మెప్పించే తరహాలో
ఏదైనా వినిపించండీ
ఎంతైనా వినిపించండి"

"అర్థాలు వెదుక్కునేలా కాదు
అందరికీ అర్థమయ్యేలా రాయండి"

"ఉబుసుపోక రాయడం కాదూ
ఉత్తేజాన్నిచ్చే కవిత్వం రాయండి"

"గుండె లోతులోంచి ఆలోచిస్తూ
నిండు రచనల్ని ఆవిష్కరించండి"

కన్నోజు వారి కవిత్వం ఎక్కువ భాగం ప్రభోదాత్మకంగానే ఉన్నది. వీరి కవిత్వంలో వ్యంగ్యం అక్కడక్కడా తొంగిచూసినా అది తక్కువమోతాదులోనే ఉంది. మన సంస్కృతీ సంప్రదాయాలపైన అభిమానం, మానవత్వం పట్ల మమకారం, గ్రామసీమల పైన ప్రేమ, పర్యావరణం మీద అభిరుచి, మంచి రచనలకోసం ఆరాటం, కపట ప్రేమలపై నిరసన ఇవన్నీ కన్నోజు లక్ష్మీకాంతం గారిని కవిత్వం వ్రాయడానికి ప్రేరకాలుగా పనిచేశాయి.

ఈ కవి ఇంతకు ముందు 'చార్మినార్ నానీ'ల పేరుతో ఒక పుస్తకాన్ని ప్రకటించినట్టూ, దానిపై పలువురు ప్రముఖులు ప్రశంసల వెల్లువ కురిపించినట్లూ ఈ పుస్తకంలో సమాచారం ఉంది. ఈ నానీల పుస్తకం పలు సాహితీ సంస్థల నుండి పురస్కారాలను పొందడం విశేషం. ఈ'కన్నోజు కవిత'కూడా 'చార్మినార్ నానీ'లవలె మంచి పేరు గడిస్తుందని ఆశిస్తున్నాను.

[సాహితీ కిరణం మాస పత్రిక జూలై 2009 సంచిక నుండి]

కామెంట్‌లు లేవు: