...

...

20, మే 2012, ఆదివారం

మా బాదం చెట్టు కథపై లాస్య రామకృష్ణ విశ్లేషణ!

              ఆంధ్రపాఠకుల ఆహ్లద రచయిత మల్లాది వేంకట  కృష్ణమూర్తి . పాఠకుల హృదయాలలో ఆయన  స్థానం సుస్థిరం.  . సరళమైన భాష, సుస్పష్టమైన శైలి ఆయన సొంతం.



            మల్లాది గారి 'మా బాదం చెట్టు ' కధ నన్ను బాగా ఆకర్షించింది. టైటిల్ చూడగానే నన్ను చిన్ననాటి రోజులకి అక్షరాలనే టైం మెషిన్ తో ఈ కథ  తీసుకెళ్ళిపొయింది. ఉత్తుమపురుష(first person) లో ఈ కథ సాగింది.

     సంక్షిప్తంగా ఈ కథ గురించి చెప్పుకోవాల్సి వస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కథానాయకుడు తన ఇంట్లొనున్న  బాదం చెట్టు విశేషాల గురించి తలచుకుని ఆ మదురానుభూతుల్ని మనతో పంచుకుంటాడు. బాల్యం లొ బాదం చెట్టుతొ అల్లుకుపోయిన తన అనుబంధాన్ని గుర్తుచేస్తు తను వివరించే ప్రతి అంశం ప్రతి ఒక్కరికి బాల్యపు రోజులని  గుర్తుచేస్తుంది.

      కథనం బాదం చెట్టు చుట్టూ తిరిగినా, నిజానికి ఇది మధ్యతరగతి కుటుంబాలలొని  అనుబంధాలని స్ప్రుశిస్తుంది అనడానికి ఈ వాక్యాలే  ఉదాహరణ "మా నాన్నగారు ఆఫీస్ నించి రాగానే దొడ్లో తొట్లోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, ఓ సారి బాదం చెట్టు దగ్గర ఆగి తన చేతులతో కింది కొమ్మని ముట్టుకునేవారు. అంతదాకా చిరాగ్గా ఉండే మా నాన్నగారిలో చిరాకంతా తక్షణం మాయమయ్యేది. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చేవారు. పిల్లలందర్నీ పలకరించాకే, మా అమ్మ ఇచ్చే కాఫీ గ్లాసుని అందుకునే వారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు  మళ్ళి బాదం చెట్టుదగ్గరి వెళ్ళి కింది కొమ్మనుంచి ఏదో అందుకున్నట్లుగా నటించి ఆఫీస్‌కి  వెళ్ళిపోయేవారు.   మా నాన్నగారి సంతానంలో మేం ఎవరం మా ఆఫీస్ సమస్యల వల్ల కలిగే చీకాకుని ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద చూపించి ఎరగం. మా నాన్నగారు మాకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండటానికే ఆ బాదం చెట్టుని వాడుకుని ఉంటారని నాకు పెద్దయ్యాక అర్థమైంది." 

      ఎంతో సున్నితంగా తల్లి ప్రేమని కూడా రచయిత ఈ మాటల ద్వారా  చాలా అందంగా చిత్రీకరించారు.

              "అమ్మా! ఆ బాదం చెట్టుని ఎవరు కనుక్కున్నారు?" 
             "నువ్వేరా, నీ చిన్నప్పుడు ఓ రోజు నువ్వు నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి చెప్పావు."
               మా మధ్య రెండు మూడు రోజులకోసారి ఈ సంభాషణ జరిగేది. 
ఇప్పుడనిపిస్తోంది, అది నిజమై ఉండదని. ఎందుకంటే నేను బాల్యంలో ఉండగానే అది బాగా ఎదిగి కాయలు కాస్తోంది.
     నేను కనిపెట్టానని చెప్పి నన్ను బాల్యంలో మా అమ్మ ఆనందింప చేసిన ఆ చెట్టు వంక తృప్తిగా చూసి వెనక్కి తిరిగాను. 

      అంతే కాకుండా, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములతో  మరియు స్నెహితులతో కథానాయకుడికి ఉన్న అనుబంధానికి  నిలయం అయ్యింది బాదం చెట్టు.

        ఇంచుమించుగా ప్రతి ఒక్క పాఠకుడికి  కథానాయకుడి  బాల్యంలొ తమకి తమ బాల్యం ప్రతిబింబించే విధంగా రచయిత కథనం సాగించారు. నిద్ర లేవ గానె బాదం చెట్టు కిందకి పండి రాలిన బాదం కాయల కోసం పరిగెత్తటం, బాదం ఆకులలో ఫలహారం తినడం, బాదం కొమ్మలకి ఉయ్యాలలు  వెయ్యటం, చెట్టు నీడలో బొమ్మల పెళ్ళిల్లు ఇంక ఎన్నెన్నొ ఆటలు చిన్న చిన్న పొట్లాటలతొ మదురమైన జ్ఞాపకాలు తీయని కలలాగ కంటి ముందు కదులుతుంది.

       ఈ నాటి హడావిడి  జీవితాలలో ఇప్పటి పిల్లలకి  ఇలాంటి మధురానుభూతులు కరువవుతున్నాయి అని రచయిత హృదయాన్ని స్పృసించే విధంగా  చెప్పారు. కథ చివర్లొ కథానాయకుడు తన పాత ఇంటి దగ్గరున్న బాదం చెట్టు ని చూడడానికి  వెళ్ళి ఒక సారి అ బాదం రుచి చుసి "నేనుండే కాంక్రీట్ జంగిల్‌లో మా పిల్లలకి ఇంతవరకూ బాదం పప్పు రుచి తెలీదు" అని అనుకోవడం మనల్ని ఆలొచింపజేస్తుంది.

- లాస్య రామకృష్ణ 

కామెంట్‌లు లేవు: