...

...

4, ఏప్రిల్ 2009, శనివారం

పుస్తక సమీక్ష ! - 9 వ్యాస రచనా శిల్పం

[పుస్తకం పేరు : వ్యాస రచనా శిల్పం రచన: వి.చెంచయ్య, పేజీలు: 40, వెల: రూ.20=00 ప్రతులకు: శ్రీ వి.చెంచయ్య, సాహితీ నిలయం, 10-40-15ఎ/1, జనతా పేట నార్త్, కావలి - 524 201 నెల్లూరు జిల్లా ఆం.ప్ర.]

విప్లవ రచయితల సంఘం నెల్లూరు జిల్లా శాఖ ప్రచురించిన ఈ చిన్ని పుస్తకంలో వ్యాస రచన గురించిన విలువైన ఉపయుక్తమైన సమాచారం లభ్యమౌతున్నది. ఇందులో అయిదు వ్యాసాలున్నాయి.

మొదటి వ్యాసం వ్యాస ప్రక్రియ పుట్టు పూర్వోత్తరాలు. ఈ వ్యాసంలో చెంచయ్యగారు వ్యాస రచనా ప్రక్రియ పరిణామ వికాసాలను వివరిస్తున్నారు. వ్యాస ప్రక్రియకు బీజం 16వ శతాబ్దంలో పడి, ప్రమేయం, సంగ్రహం, ఉపన్యాసం మొదలయిన పేర్లతో పెరిగి పెద్దదయి 20వ శతాబ్దం నాటికి వ్యాసం అనే పేరుతొ స్థిర పడింది. తొలి నాళ్లలో పరవస్తు వేంకట రంగాచార్యులు, జియ్యరు సూరి, కందుకూరి వీరేశలింగం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు, గురజాడ అప్పారావు మొదలైన వారు ఈ ప్రక్రియకు ప్రాచుర్యం కల్పించారు.

ఇక రెండవ వ్యాసం వ్యాసం ఎలా ఉండాలి? కొన్ని అభిప్రాయాలు. దీనిలో రచయిత వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రులు, ముద్దు నరసింహ నాయుడు, జియ్యరు సూరి, మునిమాణిక్యం నరసింహారావు, డా.ముదిగొండ వీరభద్ర శాస్త్రి, పింగళి లక్ష్మీకాంతం, సంజీవదేవ్, కొలకలూరి ఇనాక్ తదితరుల అభిప్రాయాలను క్రోడీకరించారు. చివరకు ఎన్ని లక్షణాలున్నా, వ్యాసానికి స్పష్టత, వివరణ, చదివించే గుణం ఉంటేనే వ్యాసానికున్న ప్రయోజనం నెరవేరుతుంది అని సూత్రీకరిస్తున్నారు.

మూడవ వ్యాసం వ్యాస రచన - కొన్ని మార్గదర్శక సూత్రాలు. ఈ వ్యాసంలో చెంచయ్యగారు వ్యాస రచనలో సందర్భాన్ని బట్టి కొంత అనుభూతి చోటు చేసుకున్నా ఆలోచన, విశ్లేషణ, విషయ వివరణ ముఖ్యమైనవిగా పేర్కొంటున్నారు. విషయ స్పష్టత, గతితార్కిక వివరణ, భావానికి తగిన భాషాశైలి అనే అంశాలు వ్యాస రచనకు మార్గదర్శకాలుగా గుర్తించారు.

తరువాతి వ్యాసం వ్యాస రచనా శిల్పం. దీనిలో భాష, శైలి, పదబంధాలు, జాతీయాలు, సామెతలు, ఆలంకారిక ప్రయోగం, వాక్య విన్యాసం, వ్యాసకర్త అనుసరించే వ్యూహం, ఎత్తుగడ, నిర్మాణం మొదలైన అంశాలు రచనా శిల్పాన్ని నిర్దేశిస్తాయి. వ్యాసంలోని విషయాన్ని బట్టీ, సందర్భాన్ని బట్టీ, దాని పాఠకులను బట్టీ శిల్పరీతులు మారిపోతాయి. సూటిగా, సులభంగా, బలంగా, ఆకర్షణీయంగా భావ ప్రకటన చెయ్యడానికి ఈ శిల్ప రీతులను సందర్భోచితంగా వ్యాసకర్తలు ఉపయోగించుకోవడం అవసరం అంటారు రచయిత ఈ వ్యాసంలో.

ఇక చివరి వ్యాసం వ్యాస నిర్మాణాలు. విషయ పరిధిని బట్టి అవగాహన సౌకర్యం కోసం వ్యాసాన్ని చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం, వ్యాస శకలం అనే మూడు భాగాలుగా విభజించ వచ్చనీ, విషయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పాఠకుల్ని బట్టి చిన్నవ్యాసం రాయాలా, సమగ్ర వ్యాసం రాయాలా అనేది వ్యాసకర్త నిర్ణయించుకోవాలనీ రచయిత అభిప్రాయం.

ఈ వ్యాసాలలో రాళ్లపల్లి, విశ్వనాథ, చలం, కొ.కు., శ్రీశ్రీ, కె.వి.ఆర్., త్రిపురనేని మధుసూధన రావు, సంజీవదేవ్ మొదలైన ప్రసిద్ధ వ్యాసకర్తల శైలీ భేధాలను, శిల్ప రీతులను సోదాహరణగా చర్చించి వ్యాస రచనా పద్ధతులను చక్కగా వివరించారు. వ్యాస రచనలో దృష్టి పెట్టాలనుకునే వర్ధమాన రచయితలకు ఈ పుస్తకం బాగా ఉపయోగ పడుతుంది.

కామెంట్‌లు లేవు: