...

...

25, ఆగస్టు 2013, ఆదివారం

దిష్టి బొమ్మ

      “నీకు అయి ప్రాణం లేని బొమ్మలుగా కనిపించుతాది. కాని.. నాకు- అయి-- ఈ సేతులతో సేసిన బొమ్మలు రా-- అందుకే మమకారం- చేలల్లోని- పెద్ద పెద్ద బిల్డింగుల మీద ఎండకి ఎండుతూ-- వానకి తడుస్తూ గర్వంగా నిలబడతాయి. నరదృష్టిని తిప్పికొడతాయి. ఆటిని అలా చూస్తుంటే మనసు ఎంత పొంగిపోతుందో-- ఆటిని కాలితో తోక్కి-- తగలెట్టేస్తుంటే-- నా గుండెల మీద ఎవరో తొక్కి-- తక్కుతున్నట్లుగా అనిపించిందిరా-- ఇదిగో-- సూడు-- నీ పిల్లలకి గుడ్డబొమ్మలు సేసి ఇచ్చాను. నువ్వన్నావే-- ప్రాణం లేదని- కాని నీ కూతురు సూడు - దాన్ని-- దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా సూసుకుంటుంది. దానికి రంగురంగుల గుడ్డముక్కలు సుట్టి మురిసిపోవడానికి బొమ్మమీద మమకారం- సూడు"  సుమారు ఒక అడుగు పొడుగున్న గుడ్డ బొమ్మని తన పక్కనే పడుకో బెట్టుకొని- ఆదమరిచి పడుకున్న- నాలుగేళ్ళ మనవరాలిని చూపిస్తూ అన్నాడు.
        
    "అయితే ఏటంటావు నాన్నా-- అందరూ నీ బొమ్మలని పూజిస్తూ కూకోమంటవా- ఏభై రూపాయిలు కూడా చెయ్యని, ముష్టి దిష్టిబొమ్మకి ఆ గొడవల పుణ్యమా అని -- ఒక్కోదానికి మూడొందలు దొరుకుతుంది. డబ్బు- సంపాదించడం ఇంక ఎప్పుడు నేర్చుకుంటావు-- నువ్వు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. ఆడికాడే జనం కొనుక్కుంటారు. ముందు బతకడం నేర్చుకో- తర్వాతే ఆ మమకారాలు..." కోపంగా అని- అక్కడనుండి వెళ్ళి పోయాడు.

    "బ్రతుకిచ్చిన వాడికి బ్రతకడం ఎలాగో నేర్పిస్తున్నాడు" గోపాలం కళ్ళకి నీటి తెర కమ్మేసింది. మవునంగా-- కూర్చుని బొమ్మ తయారీలో పడ్డాడు.

రావాడ శ్యామల గారి దిష్టి బొమ్మ కథలోనిది పై సన్నివేశం. ఈ కథను కథాజగత్‌లో చదవండి.
            


కామెంట్‌లు లేవు: