...

...

31, మార్చి 2012, శనివారం

కొత్త ఆవకాయ రుచి లాంటి కధ

(శ్రీదేవీ మురళీధర్‌గారి కథ అమ్మమ్మగారిల్లు కథపై సాయిపద్మ మూర్తిగారి విశ్లేషణ)                             
మనలో చాలామంది ఏదన్నా ఇబ్బంది వచ్చినా టక్కున అనే మాట ” నా చిన్నప్పుడు ..మా వాళ్ళింట్లో అలా కాదు.. మా నాన్నమ్మ ఉంటేనా.. మా అమ్మమ్మ గారింట్లో“. ఒకసారి ఆలోచిస్తే, అలా అనగలిగే జ్ఞాపకాలు ఎంత మంది సొంతం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కానీ, కొంత కాలం క్రితం తురుపుముక్క ‘కథా జగత్‘ లో అలాంటి కథ ఒకటి చదవటం జరిగింది. అదే శ్రీదేవీ మురళీధర్ గారు రాసిన “అమ్మమ్మ గారిల్లు“. యధాలాపంగా మొదలెట్టిన ఈ కథలో మనకి తెలుయకుండానే జోరబడిపోతాం. ఇది ఒక చిన్నపిల్లవాడు శేషు కథ. వేసవి సెలవులన్నీ అమ్మమ్మ తాతల వాత్సల్యంలో పెరిగిన చిన్న విత్తు లాంటి కథ. ఎదుగుదల అంటే మన డ్రాయింగ్ రూం లో మరుగుజ్జు మహా వృక్షం కాదు.. ప్రకృతి తో, తరతరాలకు వారసత్వంలా వస్తున్న విలువలతో పూర్తిగా మట్టిలో నుంచి లేచి తన వ్యక్తిత్వంతో ఎంతో మందికి నిలువ నీడ, భవిష్యత్ అడుగు జాడ ఇవ్వాలి అన్న విషయం.. అందంగా చెప్తుందీ ఈ కథ.  

ఆ చెప్పటం కూడా, చాలా చిన్న విషయమైన ఆవకాయ ద్వారా చెప్పిస్తారు రచయిత్రి. . తర్వాత తరానికి తను పెట్టె ఆవకాయ పాళ్ళు ఎక్కడ తెలియకుండా పోతాయోనని, జాగ్రత్తగా దాచిన అమ్మమ్మ, చనిపోయినప్పటికీ, ఎప్పటికీ ఆ మనవడి మనసులో చిరంజీవి. చదువుతుంటే, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే, చదువులు దెబ్బ తింటాయి అని అని వాళ్ళని తీసుకురాకుండా వచ్చే తల్లి తండ్రులు, ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, పోషకాహారం పెట్టాలి కానీ కుదరటం లేదు అని వాపోయే వాళ్ళూ, అత్తగారు పోయారు ఇంక వంటల్లో సలహాలేవరిస్తారు అని దిగులు పడే కోడళ్ళూ, తప్పక చదవాల్సిన కధ ఇది.  
చైల్డ్ సైకాలజీ అంటూ.. బిహవియర్ నేర్చుకోవాలంటూ, ఏ క్లాసు లో పడితే ఆ క్లాసు లో మోయలేని బరువులు మోస్తూ తిరిగే మన చిన్నారులకి కావలసిందేమిటో వివరంగా చెప్పబడింది ఈ కథలో.  హబ్బే..ఇవన్నీ మాకు తెలుసండీ అనే వాళ్లకి.. శేషు వ్యక్తితానికి, మిగాతావారికీ ఉన్న తేడా, జీవన మాధుర్యం కూడా మనకి చెప్పకనే చెబుతుంది. ఒక నిముషం మనందరం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోనేలా చేసిన ఈ కథకి రుణపడిపోతాం.  
గాభారాపడి పెద్ద బాల శిక్ష పుస్తకాలు కొనే వాళ్ళు, తెలుగు చదవద్దు అన్నారు మావాడి కాన్వెంట్ లో..!!, ఎలా నేర్పించాలో ఏమిటో అని బాధ పడే దేశ విదేశీ తల్లులూ, తండ్రులూ, ఎలా చెప్తే పిల్లలు నేర్చుకుంటారో ఈ కథ చదివి తెలుసుకోవచ్చు. కొంచం ఈ కథ నిడివి ఎక్కువ ఉంటె బాగుంటుందని అనిపించింది నాకు. ఎందుకంటె తెలుగులో ఈ మధ్య కాలంలో అచ్చమైన తెలుగు కథలు అరుదుగా వస్తున్నాయి. వచ్చినా, నగర సంస్కృతి కథలే ఎక్కువ ఉంటున్నాయి. దానితో, కథలు కూడా అపార్ట్ మెంట్ గోడల్లా ఎవరికీ సొంతం కాకుండా ఉంటున్నాయి. పల్లె జీవితంలో నేర్చుకోవలసిన విషయాలూ, కుటుంబాల్లో కనుమరుగవుతున్న విలువలూ, ముఖ్యంగా సాహిత్యం, కళల పట్ల ఆదరణ ఇలాంటివి కూడా రచయిత్రి సూచనప్రాయంగా చెప్పి ఉంటె బాగుండును అనిపించింది.  
ఇంగ్లీషులో ” చికెన్ సౌప్ ఫర్ ది సౌల్” అని కథలుంటాయి. చాలా చిన్న చిన్న, మనం మరచిపోతున్న జీవిత సత్యాలతో ఉండే ఆ కథలు చదువుతున్నప్పుడు అనిపించేది, ఇంత సాహిత్య వారసత్వం ఉన్న తెలుగులో ఇలాంటి కథలెందుకు రావూ అని…బహుశా అలాంటి సున్నితత్వం కూడా పాళ్ళు తెలియని ఆవకాయలా, వ్యాపార వస్తువయ్యిందా అనుకున్నంతలో,  ఈ కథ నా కళ్ళు తడయ్యేలా చేసింది.. ఎక్కడినుండో మా అమ్మమ్మ..” వంటా, జీవితం..ఒకటేనమ్మలూ..అన్నీ సరిగ్గా కుదిరితేనే రుచి..!” అని చెప్పనట్టు అనిపించింది. ఉరుకుల పరుగులే జీవితమనుకున్న మాలాంటి వాళ్లకి మంచి కథని అందించినందుకు శ్రీదేవి గారికి ధన్యవాదాలు.  
తురుపుముక్క కథాజగత్ లో  ప్రచురితమైన ఈ కథ చదవాలనుకునే మిత్రుల సౌలభ్యం కోసం.. ఈ కథ లింక్: 
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/am-mam-magarillu---sridevi-muralidhar
                                 (తమ్మిమొగ్గలు బ్లాగు సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు: